Amit Shah: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) .. ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. రెండు వారాలుగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సైతం నడుస్తోంది. దీంతో అక్కడి శాంతి భద్రతలను ప్రస్తుతం కేంద్రమే నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో కీలక భేటి జరిగింది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే కావడం విశేషం. ఈ సమావేశంలో హోంమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ లో జనసంచారానికి సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
మార్చి 8 నుంచి స్వేచ్ఛాయుత రాకపోకలు
మణిపూర్ లో నెలకొన్న తాజా పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటికి ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో మణిపూర్ లోని శాంతి భద్రతలను గురించి షా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జన సంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆదేశించారు. మార్చి 8వ తేదీ నుంచి ప్రజలు స్వేచ్ఛగా రోడ్లపై తిరిగే వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. ఇందుకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.
Read Also: Trump vs Zelensky: ట్రంప్ కు జై కొట్టిన రష్యా.. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఘాటు విమర్శలు
శాంతిని పునరుద్ధరిస్తాం: అమిత్ షా
జాతుల మధ్య వైరంలో రగిలిపోతున్న మణిపూర్ లో శాంతి స్థాపనకు కేంద్రం కృష్టి చేస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా అన్నారు. అందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తాజా సమావేశం అనంతరం షా స్పష్టం చేశారు. భద్రత చర్యల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చే ఎంట్రీ మార్గాలు, సరిహద్దుల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఫెన్సింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సైతం ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే ఆ పనులు కంప్లీట్ అవుతాయని షా స్పష్టం చేశారు.
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన ఎందుకంటే?
మణిపూర్ లో రెండు జాతుల మధ్య తలెత్తిన వివాదం ఆ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చాయి. గత రెండేళ్లుగా కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అవి తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితిని అదుపుచేయలేక సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా సైతం చేశారు. దీంతో మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు చేసింది. కాగా కుకీ, మెయితీ తెగల తలెత్తిన ఘర్షణలో 250 మందికి పైగా చనిపోగా లక్షలాది మంది ప్రజలు కట్టుబట్టలతో ఊర్లు విడిచి వెళ్లిపోయారు. రాష్ట్రపతి పాలన విధించినప్పటీ నుంచి మణిపూర్ లో పరిస్థితులు కాస్త మెరుగవుతూ వస్తున్నాయి.