Himani Narwal: హర్యానాలోని ఓ బస్టాండ్ సమీపంలో పడి ఉన్న ఓ సూట్ కేస్ అటుగా వెళ్తున్న వారి దృష్టిని ఆకర్షించింది. అయితే అందులో ఉగ్రవాదులు బాంబులు ఏమైనా పెట్టారేమోనని భయపడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలికి చేరుకున్నారు. అందులో బాంబు లేదని నిర్ధారించుకొని తెరిచేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా గుప్పుమంటూ వచ్చిన వాసన అక్కడి వారి ముక్కులు అదిరిపోయేలా చేసింది. సూట్ కేస్ లో శవం ఉండటాన్ని చూసి పోలీసులు సహా స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ బాడీ మహిళా కాంగ్రెస్ యువనేతదని తెలుసుకొని మరింత ఖంగు తిన్నారు.
అసలేం జరిగిదంటే..
హర్యానా జిల్లాలోని రోహతక్ జిల్లాలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. సూట్ కేస్ లో ఉన్న బాడీని ఆ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ (23)గా పోలీసులు గుర్తించారు. దుండగులు ఆమెను హత్య చేసి అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. సప్లా బస్టాండ్ సమీపంలో ఆ సూట్ కేస్ స్థానికుల కంట పడటంతో ఈ దారుణ విషయం వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హత్య ఎలా చేశారంటే!
హత్యకు గురైన హిమానీ నార్వాల్ ది రోహ్ తక్ లోని విజయ్ నగర్ ప్రాంతం. సూట్ కేస్ లో ఆమె మృత దేహాన్ని పరిశీలించిన పోలీసులు కీలక విషయాలను కనుగొన్నారు. హిమానీ మెడకు చున్నీ చుట్టి ఉన్నట్లు రోహ్ తక్ పోలీసులు తెలిపారు. దీంతో ఆమె మెడను చున్నీతో బిగించి హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హిమానీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీజీఎంఎస్ రోహ్ తక్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
Also Read: Bolivia Road Accident: రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది స్పాట్ డెడ్
జోడో యాత్రలో చురుగ్గా పాల్గొన్న హిమానీ..
యువ నేత హిమానీ నార్వాల్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుగ్గా ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ సందర్భంలో రాహుల్ తో దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలాగే పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో దిగిన ఫొటోలను హిమానీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. హర్యానా మాజీ సీఎం కుమారుడు దీపేందర్ సింగ్ హుడాతో, కాంగ్రెస్ ఎమ్మెల్యే బిబి బాత్రాతో దిగిన ఫొటోలు ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి
మహిళా నేత హిమానీ నార్వాల్ అనుమానస్పద మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనపై స్పందించిన హర్యానా మాజీ సీఎం భూపిందర్ హుడా.. దీనిని అనాగరిక హత్యగా అభివర్ణించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో అద్దం పడుతోందని ఎక్స్ లో ట్వీట్ చేశారు. నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. కాగా పోస్టు మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సంప్లా పోలీసు స్టేషన్ ఇన్ చార్జ్ విజేంద్ర సింగ్ తెలిపారు.