Pawan Kalyan: పాకిస్థాన్ పైత్యాన్ని ‘ఆపరేషన్ సింధూర్’తో భారత్ తగ్గిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ధర్మయుద్ధానికి ఆధ్యాత్మిక మద్దతు ఇవ్వాలని పవన్ పిలుపునిచ్చారు. వచ్చే మంగళవారం షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయాలని.. ప్రతి క్షేత్రానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జనసేన కార్యకర్తలు కూడా వెళ్లి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కర్నాటకతో పాటు మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాల్లో పూజలు చేయాలని పవన్ పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇంద్రకీలాద్రి, పిఠాపురం, అరసవల్లిలోనూ సైన్యానికి మద్దతుగా పూజలు చేయించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు చర్చీలు, మసీదుల్లో కూడా ప్రార్థనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచనలు చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జనసేన ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
Read Also- Pawan Kalyan: అవ్వ అంతులేని అభిమానం.. పవన్ కళ్యాణ్ జీవితంలో మరిచిపోరేమో..
జనసేన ప్రకటనలో ఏముంది?
‘ఆపరేషన్ సింధూర్.. పాకిస్థాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమనీ, శత్రు మూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి దైవ బలం, ఆశీస్సులు ఉండేలా భగవంతుణ్ణి ప్రార్ధించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడి గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయి. వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిది అన్నారు. జనసేన పార్టీ పక్షాన మంగళవారం ఉదయం షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి క్షత్రానికి ఒక శాసన సభ్యుడు, జనసైనికులను పంపించి పూజలు చేయిస్తారు. అదే విధంగా కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని పవన్ తెలిపారు’ అని జనసేన ప్రకటనలో వివరించింది.
Read Also- Amaravati: వైఎస్ జగన్ మళ్లీ గెలిస్తే అమరావతి పరిస్థితేంటి? ఉంటుందా?
స్వయంగా పవన్ కూడా..
‘ ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్య శక్తి తోడుండేలా పూజలు చేయిస్తారు. వీటితోపాటు రాష్ట్రంలోని వివిధ క్షత్రాల్లోనూ సైన్యం కోసం, యుద్ధ ప్రభావం ఉన్న జమ్ము, కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణ రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని కోరుతూ పూజలు చేపడతారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవారు మసీదుల్లో ప్రార్ధనలు చేపట్టాలని సూచించారు’ అని జనసేన కీలక ప్రకటనలో పేర్కొన్నది. ఇందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భారత్ మాతాకి జై.. జై హింద్.. జై భారత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also- Territorial Army: యుద్ధరంగంలోకి ధోని, సచిన్.. సౌత్ నుంచి మోహన్ లాల్.. పాక్ పని ఖతమే!
సైనికులకు, దేశ నాయకత్వానికీ దైవ బలం తోడవ్వాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన పూజలు pic.twitter.com/l9QYLo6iAC
— JanaSena Party (@JanaSenaParty) May 9, 2025