Strong Earthquake: జపాన్లోని (Japan) ఉత్తర ప్రాంతాన్ని సోమవారం నాడు తీవ్ర భూకంపం (Strong Earthquake) వణించింది. సముద్రంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 7.6 తీవ్రతగా నమోదయింది. ఈ భూకంప తీవ్రతకు సముద్రంలో సునామీ అలజడి చెలరేగింది. ఉత్తర జపాన్లోని సముద్ర తీరప్రాంతాలలో సముద్ర అలలు 40 సెంటీమీటర్ల వరకు ఎగసిపడ్డాయని జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకటించింది. జపాన్లోని హోన్షు ద్వీపానికి ఉత్తరాన ఉన్న అవోమోరికి తూర్పున, హొక్కైడో ద్వీపానికి దక్షిణాన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి సుమారు 11:15 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు జేఎంఏ అధికారులు గుర్తించారు.
ఇవాటే, హొక్కైడో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అలలు 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షితమైన, ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.
సునామీ తాకిడికి హొక్కైడోలోని ఉరకావా అనే పట్టణంలో 40 సెంటీమీటర్ల ఎత్తైన అలలు ఎగసిపడ్డాయి. అవోమోరిలోని ముట్సు ఒగవారా అనే పోర్టులో కూడా ఈ సునామీ అలలు నమోదయ్యాయి. అయితే, భూకంపంతో నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, హచినోహే అనే పట్టణంలో ఒక హోటల్లో కొంతమంది వ్యక్తులు గాయపడినట్టుగా స్థానిక మీడియా పేర్కొంది. ఈ తీవ్ర భూకంపంపై జపాన్ ప్రధాని సనే టకైచి స్పందించారు. భూకంప నష్టం ఏ స్థాయిలో జరిగిందో అంచనా వేయడానికి ప్రభుత్వం ఒక అత్యవసర టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తోందని ప్రకటించారు. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని, తీసుకోగలిన చర్యలన్నీ తీసుకుంటున్నామని ఆమె వివరించారు. అయితే, ఈ స్థాయి భూకంపాలు సంభవించినప్పుడు 1 బిలియన్ నుంచి 10 బిలియన్ డాలర్లకు వరకు నష్టాలు నమోదవుతుంటాయనే అంచనాలున్నాయి.
మరోవైపు, భూకంపం చాలా తీవ్రమైనది కావడంతో ఈ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాలలో అధికారులు భద్రతా తనిఖీలు చేపట్టాని నిర్ణయించారు. ఈ మేరకు జపాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక, భూకంప ప్రభావంతో ఈశాన్య జపాన్లో రైలు సేవలు నిలిపివేశారు.
Read Also- Viral Video: ధూమ్ మూవీ స్టైల్లో దోపిడి.. బైక్ నుంచి రన్నింగ్ బస్ ఎక్కి.. ఎలా దోచేశారో చూడండి!
సుమారు 3 లక్షల మంది ప్రజలు చాలా తీవ్రమైన ప్రకంపనలను, 12 లక్షల మంది ప్రజలు బలమైన ప్రకంపనలను అనుభూతి చెంది ఉంటారని యూఎస్జీఎస్ (United States Geological Survey) అంచనా వేసింది.

