Israel-Iran Conflicts: తమ దేశ మనుగడకు ముప్పు వాటిల్లేలా అణు కార్యక్రమాలను చేపడుతున్నారంటూ ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి ఇరాన్లోని కీలకమైన అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలే లక్ష్యంగా క్షిపణి, డ్రోన్లతో దాడులు చేసింది. మొత్తం100 టార్గెట్లను ఎంచుకొని 200 యుద్ధ విమానాలతో విస్తృతంగా దాడులు చేసింది. అణ్వాయుధ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఇందుకోసం 330 బాంబులు, భారీగా క్షిపణులను ప్రయోగించింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట చేపట్టిన ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, న్యూక్లియర్ సైంటిస్టు డాక్టర్ ఫెరెయుద్దీన్ అబ్బాసీతో పాటు షహిద్ బెష్తీ వర్సిటీ న్యూక్లియర్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, డీన్ డాక్టర్ అబ్దుల్ హమిద్ మినౌచెహర్తో పాటు ప్రముఖ సైంటిస్టులను మట్టుబెట్టింది. కీలకమైన అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి.
గుండెకాయపై కొట్టాం
గత కొన్ని నెలలుగా ఇరాన్ దూకుడు అణు కార్యకలాపాలను కొనసాగిస్తోందని, ఇప్పుడు ఆ దేశాన్ని నిలువరించకపోతే అనతి కాలంలో అణ్వాయుధాలను తయారు చేస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్కు ఇరాన్ పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నాజీ హోలోకాస్ట్ నుంచి మా దేశం పాఠాలు నేర్చుకుంది. మరోసారి మేం బాధితులుగా మిగలాలని భావించడం లేదు. అందుకే ఇరాన్ బెదిరింపులకు ప్రతిచర్య తీసుకున్నాం. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి గుండెకాయ లాంటి ప్రాంతాలపై మేము దాడులు నిర్వహించాం. నంతాజ్లోని అణు శుద్ధి కేంద్రం టార్గెట్గా దాడి చేశాం. అణ్వాయుధ అభివృద్ధి కోసం పనిచేస్తున్న అగ్ర శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నాం. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్కు కేంద్రస్థానమైన ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేశాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదివరకు కూడా ఇరాన్తో పాటు దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్పై దాడికి విఫలయత్నం చేశాయని పేర్కొన్నారు. ‘‘ మా దేశాన్ని నాశనం చేసేందుకు మరో కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. అలాంటి ఆటలు మేము సాగనివ్వబోం. అందుకే ఈ దాడులు చేస్తున్నాం. మా పోరాటం ఇరాన్ నియంతృత్వ పాలనేపైనే. ఆ దేశ ప్రజలపై కాదు’’ అని నెతన్యాహూ ఒక ప్రకటన విడుదల చేశారు.
Read this- Plane Crash: పాపం.. భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి..
ఇరాన్ ప్రతిదాడులు
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా డ్రోన్ దాడులు మొదలుపెట్టింది. ఒకేసారి ఏకంగా 800 డ్రోన్లను ఇజ్రాయెల్ టార్గెట్గా ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్కు కౌంటర్ చర్యగా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3’ పేరిట ప్రతీకార దాడులు చేసింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన చాలా డ్రోన్లను ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ అడ్డుకుంది. మరోవైపు, ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ , జోర్డాన్ దేశాలు మద్దతు తెలిపాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా, చైనా , రష్యా , ఒమన్ దేశాలు కూడా ఖండించాయి.
Read this- Hyderabad Tragedy: రైల్వే ట్రాక్పై కూతురిని కాపాడబోయి.. కన్నీళ్లు పెట్టించే ఘటన
ఇరాన్పై దాడి అద్భుతం
ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇజ్రాయెల్ అద్భుతమని కొనియాడారు. ఇరాన్కు తాము ఒక అవకాశం ఇచ్చామని, సద్వినియోగం చేసుకోలేదని ట్రంప్ అన్నారు. ఎన్నిసార్లు తిరస్కరిస్తే దాని పర్యవసానాలు అంత తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణలో అమెరికా భాగస్వామి అవుతుందా లేదా అనేదానిపై ఇప్పుడే సమాధానం చెప్పలేనని అన్నారు. ఇరాన్ అణు సమస్యను దౌత్య విధానంలో పరిష్కరించుకోవాలని, ఇందుకు అమెరికా కట్టుబడి ఉందని అన్నారు. ఇరాన్తో అణుఒప్పందంపై ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప ఏమీ సాధించలేమని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇప్పుడైనా అమెరికాతో అణు డీల్ కుదుర్చుకోవాలని సూచించారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని అమెరికా వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ఇక, సోషల్ మీడియాలో స్పందిస్తూ, అమెరికాతో ఒప్పందానికి ఇరాన్కు అవకాశాలు ఇస్తూ వచ్చామన్నారు. ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు టెహ్రాన్ అంగీకరించలేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా. అత్యంత హానికరమైన సైనిక డివైజ్లను అమెరికా తయారు చేస్తోందని అన్నారు. ఆ ఆయుధాల్లో చాలా వరకు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఇజ్రాయెల్కు తెలుసని హెచ్చరించారు. పరిస్థితి ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
భారతీయులూ జర జాగ్రత్త
ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలోని భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అలర్ట్గా ఉండాలని ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలు హెచ్చరించాయి. ‘‘అప్రమత్తంగా ఉండండి. స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎంబసీల సమాచారం కోసం సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి. అనవసరంగా ప్రయాణాలు చేయకండి. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు రెడీ ఉండాలని సూచన’’ అని ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలలోని దౌత్య కార్యాలయాలు అక్కడి భారతీయ పౌరులకు అడ్వైజరీలు జారీ చేశాయి.