Blue Ghost: అంతరిక్ష రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ (Firefly Aerospace) సరికొత్త రికార్డు సృష్టించింది. ‘బ్లూ ఘోస్ట్’ (Blue Ghost) అనే వ్యోమనౌకను జాబిల్లిపై జాగ్రత్తగా ల్యాండ్ చేసి ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేటు సంస్థగా నిలిచింది. చంద్రుడిపై అత్యంత కీలక ప్రాంతమైన మారే క్రిసియం ప్రాంతంలో వ్యోమనౌకను సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అధికారికంగా ప్రకటించింది.
నెలన్నర రోజుల ప్రయాణం
ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి జనవరి 15న ‘బ్లూ ఘోస్ట్’ ప్రయోగం జరిగింది. నాసా సహకారంతో స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ – 9 రాకెట్.. ఈ బ్లూ ఘోస్ట్ ను జాబిల్లిపైకి మోసుకెళ్లింది. దాదాపు నెలన్నర రోజుల పాటు ప్రయాణించిన బ్లూ ఘోస్ట్.. ఎట్టకేలకు సురక్షితంగా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది. జాబిల్లి కక్ష్య నుంచి ఆటోపైలట్ మోడ్లో కిందికి ప్రయాణించి ఎంతో కీలకమైన మేర్ క్రిసియం ప్రాంతంలో బ్లూ ఘోస్ట్ దిగింది. అంతేకాదు అక్కడ తీసిన తొలి ఫొటోను సైతం బ్లూ ఘోస్ట్ భూమికి చేరవేసింది. దానిని ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది.
Also Read: Revanth Reddy: ‘బీజేపీ, బీఆర్ఎస్ కలిసే డ్రామాలు ఆడుతున్నాయి’.. సీఎం రేవంత్ రెడ్డి
‘బ్లూ ఘోస్ట్’ ఏం చేయనుంది?
బ్లూ ఘోస్ట్ ల్యాండ్ అయిన మేర్ క్రిసియం ప్రాంతం ఒక బిలం లాంటి ఆకారంలో ఉంటుంది. దీని విస్తీర్ణం 742 కి.మీ విస్తీర్ణంలో.. చంద్రుడి ఉపరితలానికి 1.8 కి.మీ దిగువున ఇది ఉంది. 3.92 బిలియన్ సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో లావా ప్రవహించినట్లు నాసా గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు అదే ప్రాంతంలో బ్లూ ఘోస్ట్ పరిశోధనలు మెుదలుపెట్టనుంది. లావా ప్రవహం వల్ల అక్కడ ఏర్పడిన హీట్ ఫ్లో, ఉపరితల వాతావరణ పరిస్థితులను తొలి దశలో అధ్యయనం చేసి ఆ డేటాను భూమిపైకి పంపనుంది.
మరో ల్యాండర్ సైతం సిద్ధం
టెక్సాస్కు చెందిన ‘ఇన్ట్యూయిటివ్ మెషీన్స్’ సంస్థ ప్రయోగించిన ల్యాండర్ కూడా వచ్చే గురువారం జాబిల్లిపై దిగేందుకు సిద్ధమవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలో దీన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. గతేడాది ‘ఇన్ట్యూయిటివ్ మెషీన్స్’ సంస్థ ప్రయోగించిన మెుదటి ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలడంతో ఆ ప్రయోగం విఫలమైంది. దీంతో ఆ ప్రయోగంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ఈసారి ఎలాగైనా ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయాలని పరిశోధకులు పట్టుదలగా ఉన్నారు.