Konda Surekha: అడవులను నాశనం చేయడం ద్వారా మానవాళి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి మాత్రమే శాశ్వతమని గుర్తించి, మానవ మనుగడకు మూలమైన అడవులను పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడుతూ, దానితో మమేకమై జీవించడం ద్వారా మన జీవితం అర్థవంతం అవుతుందని సూచించారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేబీఆర్ పార్కు (లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.
‘వృక్షో రక్షతి రక్షితః’
మంత్రిగా చెట్ల సంరక్షణలో భాగస్వామ్యం అవడం తనకు గర్వకారణమని మంత్రి కొండా సురేఖ అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాల్లో వృక్ష సంరక్షణకు విశేష ప్రాధాన్యత ఉందని తెలిపారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే సూత్రాన్ని అనుసరించి చెట్లను రక్షిస్తే.. అవి మనలను రక్షిస్తాయని స్పష్టం చేశారు. ఇది జగమెరిగిన సత్యం అని మంత్రి పేర్కొన్నారు. అడవుల పరిరక్షణ యొక్క అవసరాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించిందని ఆమె వివరించారు. పర్యావరణ పరిరక్షణ, జీవజాల మనుగడకు అడవులే ప్రధాన ఆధారం అని, జీవవైవిధ్యానికి అడవులు కీలకమైనవని అభిప్రాయపడ్డారు.
తగ్గుతున్న అడవుల విస్తీర్ణం..
అడవులను ప్రజలు తమ స్వలాభం కోసం నాశనం చేస్తూ.. తమ ఉనికిని తామే ప్రశ్నార్థకం చేసుకొంటున్నారని మంత్రి ఆక్షేపించారు. పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ, ప్రాజెక్టుల నిర్మాణం, పోడు వ్యవసాయం, గృహనిర్మాణం వంటి కారణాలతో అడవుల విస్తీర్ణం తగ్గిపోతుందని తెలిపారు. భూ విస్తీర్ణానికి తగిన విధంగా అడవుల విస్తరణ లేకపోవడం గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తుందని, దీని ప్రభావంతో తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నామని అన్నారు. పర్యావరణ సమతుల్యత లోపించడంతో ప్రకృతి విపత్తుల బారిన పడుతున్నామని పేర్కొన్నారు.
Read Also: AP Heatwave Alert: మండుటెండలతో జర భద్రం.. ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు
ప్రజల సహకారం అవసరం
వన్యప్రాణులకు ఆశ్రయంగా నిలిచే అడవులను పరిరక్షిస్తే జీవ వైవిధ్యం వర్ధిల్లుతుందని మంత్రి కొండ సురేఖ చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అడవుల సంరక్షణ చర్యలకు ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. తద్వారా అడవుల విస్తీర్ణం పెరుగుతుందని ఆమె సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతోందన్న ఆమె ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అటవీ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పౌరసంఘాలు, ప్రజల పాత్ర కీలకమని, అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.