HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ ఇండస్ట్రీస్ కు 25.92 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలంటూ హెచ్సీఏ(HCA) దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్(Justice Vikram Nath), జస్టిస్ సందీప్ మెహతా(Justice Sandeep Mehta)లతో కూడిన ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. విశాఖ ఇండస్ట్రీస్ ఉప్పల్ లో అంతర్జాతయ క్రికెట్ స్టేడియంను నిర్మించిని విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్టేడియంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ ల సమయంలో వచ్చే ప్రకటనల ఆదాయాన్ని పూర్తిగా విశాఖ ఇండస్ట్రీస్ కు అందేలా 2004, అక్టోబర్ 16న ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.
ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశాలు
దీని ప్రకారం విశాఖ ఇండస్ట్రీస్ 6.50కోట్ల రూపాయలు చెల్లించి ప్రకటనల హక్కులు పొందింది. అయితే, 2011లో ఐపీఎల్(IPL) మ్యాచులకు ఈ ఒప్పందం వర్తించదంటూ హెచ్సీఏ దానిని రద్దు చేసింది. దీనిపై విశాఖ ఇండస్ట్రీస్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ సంస్థ ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం తాత్కాలిక ఇంజక్షన్ మంజూరు చేసింది. అయితే, ఈ ఆదేశాలను హెచ్సీఏ పాటించ లేదు. దాంతో హెచ్సీఏ ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ హెచ్సీఏ హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించగా రెండు చోట్లా చుక్కెదురైంది. కాగా, వివాద సమయంలో తమకు జరిగిన నష్టాన్ని హెచ్సీఏ చెల్లించేలా చూడాలని విశాఖ ఇండస్ట్రీస్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలో 2016, మార్చి 15న విశాఖ ఇండస్ట్రీస్ కు హెచ్సీఏ 25.92 కోట్ల రూపాయలను చెల్లించాలని ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. దీనిపై హెచ్సీఏ హైదరాబాద్ కమర్షియల్, వాణిజ్య కోర్టుతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా తీర్పులు దానికి వ్యతిరేకంగా వచ్చాయి.
Also Read: Dhruva Sarja: ‘సీతా పయనం’.. ధ్రువ సర్జా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్.. గెస్ట్ రోలే కానీ!
ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఆదేశాలు..
దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హెచ్సీఏ(HCA) సుప్రీం కోర్టుకు వెళ్లింది. మంగళవారం దీనిపై విచారణ జరుగగా హెచ్సీఏ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విశాఖ ఇండస్ట్రీస్(Visakha Industries) ఇచ్చిన మొత్తానికి ఆరు రెట్లు ఎక్కువగా చెల్లింపులు చేయాలని ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. అంత మొత్తం కాకుండా మధ్యేమార్గంగా చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించాలన్నారు. గతంలో 17 కోట్లు చెల్లించటానికి హెచ్సీఏ సిద్ధమైనా విశాఖ ఇండస్ట్రీస్ అంగీకరించ లేదని తెలిపారు. అందువల్ల కేసును మధ్యవర్తిత్వం కోసం పంపించాలని కోరారు. విశాఖ ఇండస్ట్రీస్ యజమాని ప్రస్తుతం తెలంగాణలో మంత్రిగా ఉన్నరన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. అయితే, దీనికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి పిటిషనర్ కు అవకాశం ఉందని పేర్కొంటూ హెచ్సీఏ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది.
Also Read; Telangana Congress: ఆ ముగ్గురు మినిస్టర్ల మధ్య దుమారం.. రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్
