ప్రొటోకాల్ ఫుడ్పై సీఎం సీరియస్
అధికారులకు రేవంత్రెడ్డి క్లాస్
ఆగమేఘాలపై సచివాలయానికి చేరుకున్న ఫుడ్ సప్లయర్!
ఇకపై నాణ్యమైన భోజనానికి హామీ!
Revanth Reddy | తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సచివాలయంలో ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ ద్వారా అత్యంత నాసిరకం భోజనం పెడుతున్నారంటూ స్వేచ్ఛలో రెండు రోజుల కిందట ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఇలా అత్యంత ముఖ్యులకు సెక్రటేరియట్లో (secretariat) అందే అహార పదార్థాలు నాసిరకంగా ఉన్నాయని ఆ కథనంలో స్వేచ్ఛ వెల్లడించింది. ఈ వార్తను చదివిన ముఖ్యమంత్రి.. బుధవారం సంబంధిత అధికారులకు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మనం సాక్షాత్తూ సచివాలయంలో మంచి అన్నం పెట్టలేకపోవటం ఏమిటని అధికారులను నిలదీసినట్లు తెలిసింది. నాసిరకం భోజనం పంపిణీకి కారణమైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని తన కార్యాలయం అధికారులను కోరినట్లు సమాచారం.
భోజనంపై అధికారుల ఆరా
ముఖ్యమంత్రి క్లాస్ తీసుకోవడంతో వెంటనే స్పందించిన అధికారులు.. సచివాలయంలో ప్రొటోకాల్ భోజనాలు అందే చాంబర్లకు వెళ్లి అరా తీశారు. ఎలాంటి భోజనం వస్తున్నది? బాగా లేకపోవటానికి కారణం ఏమిటి ? అనే విషయాలను అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ తరఫున సచివాలయానికి భోజనాలు సప్లయ్ చేస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టరు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ గురించి నెగిటివ్గా చెప్పొద్దని, ఇకపై మంచి భోజనాలు (food) పంపిణీ చేస్తామని, తమకు సహకరించాలని కింది స్థాయి సిబ్బందిని మేనేజ్ చేసే ప్రయత్నించినట్టు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది.
ఒక్కో భోజనానికి ఐదు వందలు
ప్రతి రోజూ సచివాలయానికి ఏడు వందల నుంచి వెయ్యి భోజనాలు ఆ కాంట్రాకర్ట్ సప్లయ్ చేస్తాడు. ఇందుకోసం ఒక్కో భోజనానికి ఐదు వందల రూపాయలను ప్రోటోకాల్ నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా నెలకు కోట్ల రూపాయల్లో బిల్లులు వెళుతున్నా, ఏ మాత్రం నాణ్యత లేని భోజనం సరఫరా చేయటంపై ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందితో పాటు, మిగతా పేషీల వారు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రి వార్నింగ్ తోనైనా పరిస్థితి మారి సచివాలయానికి మంచి రుచి, శుభ్రమైన భోజనాలు పంపిణీ అవుతాయనే ఆశతో అటు అధికారులు, ఇటు సిబ్బంది ఉన్నారు.