Hyderabad Collector: నిండు ప్రాణానికి రెండు చుక్కలు అని పోలియో రహిత సమాజమే తమ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ (Hyderabad Collector) హరిచందన దాసరి అన్నారు. కలెక్టరేట్ లోని తన చాంబర్ నుండి ఈ నెల 12 నుండి 15 వరకు నిర్వహించే పల్స్ పోలియో నిర్వహణ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమం భారతదేశంలో, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలన్న సంకల్పంతో 1995లో పల్స్ పోలియో మందు పంపిణీని ప్రారంభించినట్లు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా గుర్తించడం జరిగిందని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read: UPSC ESE 2026: యూపీఎస్సీ లో ఇంజనీరింగ్ జాబ్స్.. వెంటనే, అప్లై చేయండి!
హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 12 నుండి 15 వరకు పోలియో
అయినప్పటికీ పొరుగు దేశాలైన పాకిస్తాన్, అఫ్గనిస్థాన్ , బంగ్లాదేశ్ లలో ఇంకా పోలియో కేసులు నమోదు అవుతున్నందున భారతదేశంలో పోలియో కేసుల నివారణ కోసం పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. అందులో భాగంగా మన హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 12 నుండి 15 వరకు పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అందులో భాగంగా 12న హైదరాబాద్ లోని 2843 కేంద్రాల్లో పోలియో మందును అపుడే పుట్టిన శిశువు మొదలుకుని అయిదేళ్లు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు.
9 లక్షల 36 వేల 016 ఇండ్లల్లో ఉన్న అయిదేళ్ల లోపు పిల్లలు
పోలియో వ్యాధి నివారణకు రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 5 లక్షల 17వేల 238 మంది పిల్లలకు పోలియో చుక్కలు అందించనున్నట్లు ఆమె వెల్లడించారు. నగరంలో 9 లక్షల 36 వేల 016 ఇండ్లల్లో ఉన్న అయిదేళ్ల లోపు పిల్లలను కవర్ చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు కలెక్టర్ వివరించారు. పోలియో కేంద్రాలు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరచి ఉంటాయని, 13, 14, 15 తేదీలలో 11 వేల 200 మంది వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.
కేంద్రాలలో తప్పక పోలియో చుక్కలు వేయించాలి
హైదరాబాద్ లో 164 హై రిస్క్ ఏరియాలను గుర్తించడం జరిగిందని వెల్లడించారు. అపార్ట్ మెంట్, గృహాలలో ఉండే చిన్నారులకు తల్లిదండ్రులు తమ కు సమీపంలో ఉన్న పల్స్ పోలియో కేంద్రాలలో తప్పక పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వచ్చంద సంస్థలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, వాలంటీర్స్, పారా మెడికల్, నర్సింగ్ విద్యార్థులు పాల్గొననున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి, డీఎంఓ డాక్టర్ రాములు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Paddy procurement: ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమైన ప్రభుత్వం.. ఈసారి చాలా పకడ్బందీగా!
