MLA Raja Singh: బీజేపీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ రాజాసింగ్. హైదరాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన అంశంపై ఆయన ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా కాషాయ పార్టీ సీనియర్ నేత అయిన గౌతమ్ రావును బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో మేకప్ మ్యాన్ ఉన్నారని, టేబుళ్లు తుడిచేవారికి టికెట్లు ఇస్తారని చేసిన వరుస స్టేట్ మెంట్లతో పార్టీ షేకయింది. కాగా ఎట్టకేలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూల్ అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఇష్యూలో సంధి కుదిరింది. హనుమాన్ జయంతి శోభాయాత్రతో ఇష్యూ ఒక కొలిక్కి వచ్చింది.
హైదరాబద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం గెలుపు కోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే అభ్యర్థి ఎంపికపై సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇరకాటంలో పడింది. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే అభ్యర్థిని ఫైనల్ చేసే అంశంలో ఎవరితో చర్చలు జరపకుండానే ఫైనల్ చేశారని ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ తరుణంలో పార్టీని గాడిలో పెట్టేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగారు.
అయితే రాష్ట్ర నాయకత్వం ఆయన్ను పురమాయించిందా? లేక ఆయనే వ్యక్తిగతంగా వెళ్లారా? అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే.. ఇటీవల రాజాసింగ్.. గతంలో తనకు ఒక అన్న సపోర్ట్ గా నిలిచారని, అయితే ప్రస్తుతం ఆయన తనకు అండగా ఉన్నారో? లేదో తెలియడం లేదని కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా బండి సంజయ్ ను ఉద్దేశించే అన్నారనే ప్రచారం జోరుగా జరిగింది. తాను అండగా ఉన్నాననే విషయాన్ని స్పష్టంచేయడంలో భాగంగా బండి.. రాజాసింగ్ తో భేటీ అయ్యారా? అనే చర్చ కూడా సాగుతోంది.
Also read: TDP Alliance Govt: సీఎం చేతిలో అవినీతి చిట్టా.. ఆ నాయకుల పని పడతారా?
పాతబస్తీలో బండి పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సంధి కుదరడంతో పాటు రాజాసింగ్ ను మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయడంపైనా చర్చ జరిగినట్లుగా తెలిసింది. అంతేకాకుండా త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక జరగనున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అంశంపై మద్దతు కూడగట్టేందుకు రాజాసింగ్ తో ఏమైనా చర్చించారా? అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ భేటీలో రాజాసింగ్… గౌతమ్ రావు ఒకరినొకరు శాలువా కప్పుకుని ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. దీంతో సంధి కుదిరిందని స్పష్టమైంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు ఏకగ్రీవం అయ్యేందుకు చాన్స్ ఇవ్వొద్దని బీజేపీ పట్టుపట్టి అభ్యర్థిని ఫిక్స్ చేసింది.
బలం లేకున్నా బరిలోకి దిగింది. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కలిసి ఓట్లడుగుతామని కమలదళం స్పష్టం చేసింది. ఈ అంశంపై బండి దేశ భక్తులైతే బీజేపీకి ఓటేయాలని కోరారు. ఈనెల 24న పోలింగ్ జరగనుంది. ప్రజాప్రతినిధులు ఎవరికి పట్టం కడుతారన్నది ఆసక్తికరంగా మారింది. బలం లేకపోయినా ఎంఐఎం కంచుకోటలో బీజేపీ పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.