Hydraa: కోర్టు ఆదేశాలున్నా బేఖాతరు చేస్తున్నారు, భవన నిర్మాణ నియమనిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. నిబంధలను ఏ మాత్రం అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ పలువురు హైడ్రా(Hydraa) ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్లాట్కు పక్కన రోడ్డున్నా, పార్కున్నా, కలిపేసుకుంటున్నారని ఫిర్యాదుదారులు వాపోయారు. కోర్టు స్టేటస్ కో ఉన్నా, గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు(Sridhar Rao) అక్రమంగా పలు నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని పలువురు ప్లాట్ యజమానులు ఫిర్యాదులో పేర్కొన్నారు. లే ఔట్ నామరూపాలు లేకుండా చేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ వాపోయారు.
ఇష్టానుసారంగా నిర్మించుకుని
ఎక్కడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఉత్తర్వులున్నా, ఏ మాత్రం ఖాతరు చేయకుండా నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారంటూ ప్లాట్ యజమానులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో తమకు అనుమతులున్నా, నిర్మాణాలు చేయడానికి వీల్లేదన్న అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయని వాపోయారు. రహదారులు ఇష్టానుసారంగా నిర్మించుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. కాప్రా జవహార్నగర్ సరిహద్దులలో లే ఔట్ వేసి, 33 అడుగుల రోడ్డును ఆక్రమించేశారని ఫిర్యాదు చేశారు. ఇలా ప్రజావాణికి 48 ఫిర్యాదులు రాగా, వాటిలో పార్కులు, రహదారుల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నట్లు హైడ్రా వెల్లడించింది. వీటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుల వివరాలు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గోపన్నపల్లి గ్రామంలో సర్వే నంబర్ 178లో ఉన్న ప్రభుత్వ భూమి, చిన్న, పెద్ద చెరువు పరిధిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని బ్రిక్స్ స్కైవుడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. 2023 డిసెంబర్ 17న హమీద్ అనే వ్యక్తి ప్రభుత్వం నిర్మించిన ప్రహరీని కూల్చేసి, చెట్లను నరికేసి, చదును చేసి ఆక్రమించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటినా, ఆక్రమణలు ఆగలేదని వాపోయారు. ప్రభుత్వ భూమిని రక్షించాలని కాలనీ వాసులు హైడ్రా(Hydraa) ప్రజావాణిలో పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నారాయన్ చెరువు ఆక్రమణలకు గురవుతోందని అన్నారాయన్ చెరువు పరి రక్షణ సమితి హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేసింది. నిర్మాణ వ్యర్థాలను వేసి చెరువును మట్టితో నింపేస్తున్నారని పరిరక్షణ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు.
Also Read: Botsa Satyanarayana: కూటమి సర్కార్ అట్టర్ ఫ్లాప్.. దోపిడీలు పెరిగిపోయాయి.. బొత్స ఫైర్
ఎలాంటి దరఖాస్తు చేసుకోకుండా
హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి, చెరువుల్లో ఎలాంటి డంపింగ్ కార్యకలాపాలు చేయరాదని తెలిపినా వ్యర్థాలు వేయడం కొనసాగుతోందని ఫిర్యాదు చేశారు. పర్యావరణానికి, జల వనరులకు ముప్పు వాటిల్లే అవకాశమున్నందున హైడ్రా చర్యలు తీసుకోవాలని కోరారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీలో రెండు ప్లాట్ల మధ్య 100 గజాల వరకూ ప్రభుత్వ స్థలం ఉంటే, ఇరువైపుల వారు దానిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందులో ఒకరు కబ్జాచేసినది రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, మరోకరు ఎలాంటి దరఖాస్తు చేసుకోకుండా 70 గజాలకు పైగా కబ్జా చేసేస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాను ఎల్ ఆర్ ఎస్ చెల్లించగా, తన దరఖాస్తు ఎమ్మార్వో కార్యాయంలో పెండింగ్ లో ఉండగా, పక్కన ఉన్న ప్లాట్ యజమాని నేరుగా కబ్జా చేయడమే కాకుండా, రూమ్ కూడా నిర్మించేస్తున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
పాత లే ఔట్ ప్రకారం
షేక్పేటలోని సక్కుబాయి నగర్ లే ఔట్ మొత్తం 25 ఎకరాలు చేయగా, ఇందులో మొత్తం 249 ప్లాట్లున్నాయి. 16,158 గజాలను ప్రజావసరాలకోసం కేటాయించారు. ఇదే లే ఔట్ను రివైజ్ చేశారు. 2022లో ఇష్టానుసారంగా పార్కులు, రహదారులు కబ్జాచేసే ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను ప్లాట్లుగా మార్చేశారంటూ సక్కుబాయి నగర్ నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 2022లో రివైజ్ చేసి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను 13 వేల 282 గజాలకు తగ్గించేశారని, నివాసితులు ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత లే ఔట్ ప్రకారం 16 వేల గజాలుండేలా చూడాలని కోరారు. బేగంపేట, భగవంత్పురం ప్రాంతంలోని విమానాశ్రయం నుంచి వస్తున్న వరద కాలువను ఓ వ్యక్తి ఆక్రమించి మట్టితో నింపుతున్నారని, దీంతో భగవంత్పురంలో నివాసాలు వర్షం వచ్చినప్పుడల్లా నీట మునుగుతున్నాయని అక్కడి నివాసితులు ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: PCC-Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి కదలికలపై పీసీసీ ఫోకస్?