VC Sajjanar: రాష్ట్రంలో 23మంది ఐపీఎస్ అధికారులను బదిలి చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ ఆర్టీసీ ఎండీగా వ్యవహరించిన వీసీ సజ్జనార్ ను హైదరాబాద్ సిటీ పోలీసులు కమిషనర్ గా ప్రభుత్వం నియమించడం గమనార్హం. దీంతో ఆయన నిర్వర్తించిన ఆర్టీసీ ఎండీ పోస్టును నాగిరెడ్డికి అప్పగించారు. పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా పేరున్న వీసీ సజ్జనార్.. 2021లో ఆర్టీసీ ఎండీగా వెళ్లినప్పుడు అప్పట్లో చాలా మందిలో అసంతృప్తి వ్యక్తమైంది. చాలా కాలం తర్వాత ఆయన తిరిగి పోలీసు యూనిఫామ్ లో కనిపించనుండటంతో అది కూడా హైదరాబాద్ సిటీ కమిషనర్ గా రాబోతుండటంతో పోలీసు డిపార్ట్ మెంట్ తో పాటు సామాన్యుల్లోనూ సంతోషం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సజ్జనార్ ఐపీఎస్ కెరీర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వీసీ సజ్జనార్ నేపథ్యం..
వీసీ సజ్జనార్ నేపథ్యానికి వస్తే.. కర్ణాటకలోని హుబ్లీ ఆయన స్వస్థలం. శ్రీసీబీ సజ్జనర్, శ్రీమతి గిరిజా సజ్జనార్లకు ఆయన జన్మించారు. హుబ్లీలోని జీజీ కామర్స్ కాలేజీలో ఆయన బీకాం పూర్తి చేశారు. కర్ణాటక విశ్వవిద్యాలయం, ధారవాడ్లో ఎంబీఏని అభ్యసించారు. 1996లో ఐపీఎస్ కు సెలక్ట్ అయిన వీసీ సజ్జనార్.. ముస్సోరిలోని లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మి నిస్ట్రేషన్ లో ప్రారంభ శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పోలీసు ట్రైనింగ్ తీసుకున్నారు.
జనగామలో పోలీసు కెరీర్ స్టార్ట్..
వీసీ సజ్జనర్ తన పోలీస్ కేరిర్ ను అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏఎస్పీ)గా ప్రారంభించారు. అనంతరం
కడప జిల్లాలోని పులివెందుల ఏఎస్పీ గా విధులు నిర్వర్తించారు. పదోన్నతి తర్వాత కీలకమైన నల్గొండ, కడప, గుంటూరు, వరంగల్, మెదక్ జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా సేవలందించారు. సీఐడీలోనూ ఆర్థిక నేరాల విభాగ ఎస్పీగా పనిచేశారు. అలాగే ఆక్టోపస్ ఎస్పీతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గానూ సజ్జనార్ పనిచేశారు.
2021 నుంచి ఆర్టీసీ ఎండీగా..
అనంతరం డిప్యూటీ ఇన్స్పె క్టర్ జనరల్ (DIG), ఇన్స్పె క్టర్ జనరల్ (IG) పదోన్నతులు సాధించారు. మార్చి 2018 వరకు ఇంటెలిజెన్స డిపార్టమెంట్లో సజ్జనార్ విధులు నిర్వర్తించారు. మార్చి 2018 నుండి ఆగస్టు 2021 వరకు కీలకమైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. సెప్టెంబర్ 2021లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ వస్తున్నారు. తాజా ఐపీఎస్ బదిలీలలో హైదరాబాద్ సిటీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.