GHMC Corporators: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్పై భాగ్యనగరంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి రోజైన కార్పొరేటర్ల పర్యటన ఫ్యామిలీ టూర్గా సాగిందన్న ఆరోపణలు రాగా, రెండో రోజైన గురువారం కూడా ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే పర్యటన కొనసాగింది. అధికారిక షెడ్యూల్లో లేని రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ సందర్శన ఇప్పుడు మరో వివాదానికి తెరలేపింది. అహ్మదాబాద్లో పట్టణ ప్రణాళిక, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై అధ్యయనం చేయాల్సిన కార్పొరేటర్లు, అందుకు భిన్నంగా రాజ్కోట్ వెళ్లడంపై నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు ద్వారక, సోమనాథ్ దేవాలయాల సందర్శనకే పరిమితమవ్వడంపై విమర్శలు రావడంతో, అప్పటికప్పుడు కొందరు కార్పొరేటర్లు రాజ్కోట్ మ్యాప్ చూపుతూ ఫోటోలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: GHMC Corporators: సమయం లేదు మిత్రమా… సంపాదించాల్సిందే!
విపక్షాల ఆగ్రహం
ఈ స్టడీ టూర్ నియమ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని విపక్ష కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఫ్యామిలీ టూర్లు, జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. స్టాండింగ్ కమిటీ నిర్ణయానికి విరుద్ధంగా పర్యటన సాగుతున్నందున, దీనికి సంబంధించిన ఖర్చులను జీహెచ్ఎంసీ చెల్లించకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. వివాదాస్పదంగా మారిన ఈ టూర్పై జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. స్టడీ టూర్ పేరుతో జరుగుతున్న ఈ విహార యాత్రలు రాజకీయ దుమారం రేపేలా కనిపిస్తున్నాయి.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలోకి 27 యూఎల్బీల విలీనం.. మరింత పెరగనున్న బల్దియా విస్తీర్ణం!

