GHMC: గ్రేటర్ లో శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. నేటి నుంచి 30వ తేదీ నుంచి వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాల అనుమతులను నిలిపేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శిథిలావస్థలో లో ఉన్న గృహాలు, సెల్లార్ నిర్మాణాలపై కమిషనర్ తన ఛాంబర్ నుండి జోనల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అప్రమత్తంగా ఉండి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు ముందుగానే కురుస్తాయని, వాతావరణ శాఖ సూచించినందున అధికారులు అప్రమత్తంగా ఉండి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసించే కుటుంబాలకు అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. యజమానులకు మరమ్మతులకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు ప్రమాదాలు జరగకుండా గుర్తించిన ఇళ్లలో ఊహించని సంఘటన జరిగిన పక్షంలో ఆ ఏరియా అధికారి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందస్తు గానే అవగాహన కల్పించి ఆ ఇంటి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇంటి చుట్టూ ఉన్న వారిని కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇంటికి దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అట్టి గృహాలను సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్, జోనల్ అధికారులకు ఆదేశించారు.
Also Read: Megastar Chiranjeevi: ‘గద్దర్ అవార్డ్స్’.. ఎవరి పేరు మెన్షన్ చేయాలో చిరుకి తెలియదా?
శిథిలావస్థలో ఉన్న గృహాలతో పాటు సెల్లార్ నిర్మాణాలు
ఇంటి యజమానులు కూడా పూర్తిగా సహకరించి తాత్కాలిక మరమ్మత్తులు కూడా ప్రయత్నించకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని కమిషనర్ పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాలతో పాటు సెల్లార్ నిర్మాణాలు కూడా చేపట్టవద్దని తెలిపారు. ఈ వర్షాకాలంలో అందరి రక్షణ బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవ్వరికెలాంటి ప్రమాదం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని కమిషనర్ ఆదేశించారు. ఇప్పటి వరకు గ్రేటర్ లో 428 శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించడం జరిగిందని, అందులో 131 గృహాలకు మరమ్మత్తులకు అవకాశం ఉందని, మిగతా 297 నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడం, నిర్మాణ భద్రత పై పరిశీలన చేయడం, యజమానులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి సూచనలివ్వాలని ఆదేశించారు.
సైట్లో యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు
శిథిలావస్థలో నిర్మాణం స్థిరత్వాన్ని ధ్రువీకరించడం నోటిసు జారీ చేయడం, నిర్మాణాలు కూల్చివేతకు తదుపరి చర్యలు తీసుకోవడం భవనాన్ని ఖాళీ చేయమని కౌన్సిలింగ్ చేయడం మరమత్తు చేయడానికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అత్యంత ప్రమాదకరమైన స్థితిలో నిర్మాణాలు విషయంలో యజమాన్యాలు ఖాళీ చేయించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే నిర్మించిన సెల్లార్ల విషయంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం బారికేడ్లు నిబంధనల ప్రకారం జాగ్రత్త తీసుకునే విధంగా అంతేకాకుండా, సెల్లార్ లో నీరు నిలువకుండా సైట్లో యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఇంకా జీహెచ్ఎంసీ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, సెల్లార్ తవ్వకాలు గుర్తింపు సర్వే సత్వరమే పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నియమ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహాన్, రవి కిరణ్ తో పాటుగా హెడ్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.