HYDRAA: చెరువుల ఎఫ్ టీఎల్(FTL)) పరిధిలో నిర్మాణాలు చేపట్టి ప్లాస్టిక్ వ్యర్థాలతో జలాశయాలను కలుషితం చేస్తున్నారు. పక్కనే భూమి ఉన్న వారు అప్పటికే ఉన్న లే ఔట్ లోకి 50 మీటర్ల మేర చొరబడి రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తున్నారు. ఇక రహదారులు, పార్కుల గురించి పట్టించుకోకుండా, కబ్జా చేసి, అమ్మేయడం, ఆక్రమించడం వంటి ఫిర్యాదులు ప్రజావాణికి వస్తున్నాయి. దశాబ్దాల క్రితం నుంచి పార్కులు, రహదారులు, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాల పరిరక్షణకు పోరాడుతున్న వారు హైడ్రా ప్రజావాణికి హాజరై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
చివరకు బస్సులు
గొలుసు కట్టు చెరువులు, నాలాల ప్రాముఖ్యతను పట్టించుకోకుండా కబ్జాలకు పాల్పడుతున్నారంటూ వాపోయారు. నాలాలకు బఫర్ జోన్ వదలకపోవడమే గాక, వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. చివరకు బస్సులు ఆపేందుకు ఉద్దేశించిన బస్సు స్టాపులను కూడా కబ్జా చేసేస్తున్నారని వాపోయారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి 37 ఫిర్యాదులందినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. వీటిని హైడ్రా అడిషనల్ కమిషనర్ ఆర్. సుదర్శన్ పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.
ఫిర్యాదులిలా..
ఎల్బీనగర్ మున్సిపాలిటీ హస్తినాపురంలోని వెంకటేశ్వర కాలనీ ఫేజ్ -2 లే ఔట్ వేసినపుడు ప్రజారవాణా అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో 1200 గజాల స్థలాన్ని సిటీ బస్సు టర్మినల్(బస్సు స్టాప్)కోసం కేటాయించగా, తప్పుడు పత్రాలతో దానిని కబ్జా చేస్తున్నారని వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా(Hydraa) ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బయట వారు వచ్చి ఈ భూమి తమదేనంటూ కబ్జా చేశారని తమ కాలనీతో పాటు చుట్టుపక్కల కాలనీలకు బస్సు సౌకర్యం కోసం ఉద్దేశించిన బస్సు టర్మినల్ స్థలాన్ని కాపాడాలని కోరారు. మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువు ఆక్రమణలకు గురవుతుందని అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్టీఎల్ లోనే ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లున్నాయని, ఇక్కడ ఒక్కోసారి ప్లాస్టిక్ ను తగులబెడుతుండడంతో కాలుష్యం వ్యాప్తి చెందుతోందని ఫిర్యాదు చేశారు.
Also Read: Apple India: బెంగళూరు ఆపిల్ ప్లాంట్లో మహిళలకే ప్రాధాన్యం.. దాదాపు 80 శాతం మంది వాళ్లే..!
41 ప్లాట్ల హద్దులు మారిపోయాయి
ఈ ప్లాస్టిక్ పరిశ్రమతో పాటు పలు అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి కొత్త చెరువును కాపాడాలని కోరారు. మధురానగర్(Madhuranagar), సూర్య ఎవెన్యూ ఇలా చుట్టు పక్కల ఉన్న కాలనీలకు ఇబ్బందిగా మారిందని ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా అబ్దుల్లా పూర్ మెట్(Abdullahpur Met) మండలం పసుమాముల గ్రామంలోని కృష్ణా నగర్ లే ఔట్ లోకి పక్కనే ఉన్నవారు 50 అడుగుల మేర జరిగారని కృష్ణానగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా(Hydraa)కు ఫిర్యాదు చేశారు. దీంతో 41 ప్లాట్ల హద్దులు మారిపోయాయని, వారి స్థలం కబ్జాకు గురైందని పేర్కొన్నారు. 25 అడుగుల రహదారి కూడా మాయమైందని వెంటనే మా లే ఔట్ ప్రకారం రహదారిని పునరుద్ధరించాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుదారులు కోరారు.
వరద కాలువ కబ్జా
సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని విజయ విహార్ ఎంక్లేవ్ లే ఔట్ ప్రకారం రహదారితో పాటు పిల్లలు ఆడుకునే పార్కు స్థలం కబ్జాలకు గురవుతుందని, వెంటనే కాపాడాలని అక్కడి నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నాలాను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని వెంటనే ఈ నిర్మాణాలను ఆపకపోతే వర్షాకాలంలో వరదలకు సంభవిస్తాయని వాపోయారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్ పోలీసు స్టేషన్ దగ్గరలోని గంగారం చెరువు నుంచి దిగువున ఉన్న అమీన్ పూర్ చెరువుకు వెళ్లాల్సిన వరద కాలువ కబ్జాకు గురవుతుందని సీపీఐ(ఎం) పార్టీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాను ఆక్రమించడమే గాక, వరద నాలాపై స్లాబు వేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Pregnant Murder: కులాంతర వివాహం చేసుకుందని.. గర్భవతైన కూతుర్ని చంపేసిన తండ్రి

