Drug Peddlers Arrested: పక్కగా సేకరించిన సమాచారంతో కూకట్ పల్లి ఎస్వోటీ అధికారులు కూకట్ పల్లి పోలీసులతో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాలోని అయిదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 800 గ్రాముల ఎపిడ్రిన్ తోపాటు హెరాయిన్, అయిదు మొబైల్ ఫోన్లు, 50వేల రూపాయల నగదును సీజ్ చేశారు. కాగా, ఈ గ్యాంగులో తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ సభ్యునిగా ఉన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్దంకి ప్రాంతానికి చెందిన ముఠా కొంతకాలంగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను హైదరాబాద్ తీసుకొస్తూ కూకట్ పల్లి వివేకానందనగర్ కాలనీ పరిసరాల్లో విక్రయిస్తోంది.
ఈ వ్యవహారం గురించి తెలియటంతో కూకట్ పల్లి ఎస్వోటీ అధికారులు గ్యాంగ్ కదలికలపై కొన్ని రోజులుగా కన్నేసి పెట్టారు. ముఠా సభ్యులు డ్రగ్స్ తో వివేకానందనగర్ కాలనీకి వచ్చినట్టు తెలుసుకుని కూకట్ పల్లి పోలీసులతో కలిసి దాడి చేశారు. అయిదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం తిరుపతిలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తి కూడా ఈ గ్యాంగ్ సభ్యుడు. పోలీసుల దాడిని పసిగట్టిన సదరు కానిస్టేబుల్ తప్పించుకుని ఉడాయించాడు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు 2కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు రీ ఎంట్రీ!
నైజీరియన్ అరెస్ట్…2కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్
ఇక, యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు నైజీరియా దేశానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి దాదాపు 2కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాకు చెందిన ఇమ్మాన్యుయెల్ అనే వ్యక్తి చదువుకోవటానికంటూ కొన్ని సంవత్సరాల క్రితం స్టూడెంట్ వీసాపై భారత్ కు వచ్చాడు.
పాస్ పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉండిపోయిన ఇమ్మాన్యుయెల్ వస్త్రాల ఎగుమతి, దిగుమతి వ్యాపారం పేర డ్రగ్స్ దందాకు తెర లేపాడు. కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ తెప్పిస్తూ హైదరాబాద్ లో అమ్ముతున్నాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు సోమవారం ఇమ్మాన్యుయెల్ ను సికింద్రాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతని నుంచి 150 గ్రాముల కొకైన్ తోపాటు ఎండీఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 2 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
Also Read: Madhu Yashki On Kavitha: జాగృతిలో భారీ స్కామ్.. రూ.800 కోట్లు హాంఫట్.. కవితపై ఆరోపణలు!