Cherlapally Lake : చర్లపల్లి చెరువుకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. మంచినీటి సరస్సుగా రూపొందించడమే గాకా, నయన మనోహరంగా దీనిని తీర్చిదిద్ద దిశగా అడుగులు పడుతున్నాయి. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) గురువారం చర్లపల్లి చెరువును సందర్శించారు. జైళ్ల శాఖ, హైడ్రాతో పాటు స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. చర్లపల్లి జైలు ప్రాంతంలో ఉన్న 58 ఎకరాల చర్లపల్లి చెరువును ఆధునికీకరించడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దడంపై ఉభయ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు చర్చించారు. చెరువు చుట్టూ తిరిగి, ఇన్లెట్, ఔట్లెట్లను పరిశీలించారు. ప్రస్తుతం చెరువులో కొద్దిగా నీరు ఉన్నా, పరిశుభ్రంగా ఉండడంతో జీవవైవిద్యానికి అవకాశం లభించిందని ఉభయ శాఖల అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంకా ఈ చెరువు నిండా నీరుంటే మరింత ఆహ్లాదంగా మారుతుందని భావించారు. ఈ క్రమంలో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, పర్యాటక, విహార కేంద్రంగా తీర్చిదిద్దడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు కట్టను బలోపేతం చేసి పాత్వేను అభివృద్ధి చేయడం వంటి పనులను వెంటనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అలాగే సోలార్ లైటింగ్ సిస్టమ్తో పాటు సీసీ టీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తే మరింత భద్రత ఉంటుందని, చెరువులో మంచి నీరు నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాలని హైడ్రా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగానికి రంగనాథ్ ఆదేశించారు.
Read Also- Telangana: ఇన్ఛార్జీ మంత్రుల నెత్తిన పెద్ద బాధ్యతలు!
ఆరేడు చెరువుల నుంచి నీరు
హకీంపేట నుంచి నాగిరెడ్డి కుంట, కాప్రా చెరువు, మోతుకులకుంట, బైసన్కుంట గొలుసుకట్ట చెరువుల ద్వారా చర్లపల్లి చెరువుకు నీరు వస్తున్నట్లు ఉభయ శాఖల అధికారులు గుర్తించారు. ఈ చెరువుకు మురుగు నీరు కలవకుండా డైవర్ట్ నాలా కూడా ఉంది. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడక దారి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. చుట్టూ పాత్వే, మినీ పార్కులు, చెట్లు, సీటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇదో విహార కేంద్రం అవుతుందని అధికారులు వ్యాఖ్యానించారు. చర్లపల్లి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని సౌమ్య మిశ్రా వెల్లడించారు. ఒక్కో సెగ్మెంట్కు ఎంత ఖర్చు అవుతుందో? సమగ్ర నివేదిక ఇస్తే సీఎస్ఆర్ నిధులు అడగడానికి వీలవుతుందని ఆమె తెలిపారు. అంతకు ముందు చెరువుకు సంబంధించిన వీడియో చిత్రాలను, చెరువు అభివృద్ధికి చెందిన ప్రణాళికలను జైళ్ల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. ఈ పర్యటనలో హైడ్రా అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, జైళ్ల శాఖ ఐజీ మురళీ బాబు , డీఐజీలు డా. శ్రీనివాస్, సంపత్, చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
Read Also- Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్లో లవర్తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?