Friday, July 5, 2024

Exclusive

Higher Education: మిధ్యగా మారుతున్న ఉన్నత విద్య

Higher Education Is A Lie In University: ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. మన దేశం నుంచి కూడా పెద్ధసంఖ్యలో విద్యార్థులు పై చదువుల కోసం విదేశీ బాట పడుతున్నారు. ఇండియన్‌ స్టూడెంట్స్‌ మొబిలిటీ రిపోర్ట్‌-2023’ నివేదిక ప్రకారం 2019లో విదేశాల్లో 10.9 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసించగా.. 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరనుంది. మనదేశం నుంచి విదేశీ విద్యకై వెళుతున్న వారిలో ఎక్కువ మంది అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా, యుకెలను ఎంచుకుంటున్నారు. ఈ 4 దేశాల్లోనే 2023-24 సంవత్సరంలో 8.5 లక్షల మంది విద్యార్థులు చేరారు. తద్వారా ఆయా యూనివర్సిటీలకు ఫీజుల రూపంలో ఏకంగా రూ.2,83,560 కోట్లు చెల్లించారు. విదేశీ విద్య విషయంలో తర్వాతి స్థానాల్లో జర్మనీ, కిర్గిస్తాన్, ఐర్లాండ్, సింగపుర్, రష్యా, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాలున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న విద్యార్థుల్లో పంజాబ్‌, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల వారు సంఖ్యాపరంగా తొలి 3 స్థానాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో నూటికి 90 శాతం మంది అక్కడ ఉపాధి సంపాదించుకొని అక్కడే స్థిరపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్నత విద్యావ్యవస్థ గల భారత్ నుంచి అసలు ఇంతమంది ఎందుకు ఉన్నత విద్యకోసం విదేశాలు పోతున్నారనేందుకు అనేక కారణాలున్నాయి.

మనదేశంలో సుమారు 1,200 యూనివర్సిటీలు, 49,460 కళాశాలలు, 12,600 అటానమస్ హోదా గల ఉన్నత విద్యాసంస్థలున్నాయి. వీటిలో ఏటా 4.14 కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యను పొందుతుండగా, 15.5 లక్షల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. అయినా మన విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) 27 శాతమే. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నాలెడ్జ్‌ కమీషన్‌ చైర్మన్‌గా ఉన్న శ్యాం పిట్రోడా దేశంలో ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీలు సరిపోవని, పెరిగిన జనాభాకు అనుగుణంగా సుమారు పదిహేను వందల యూనివర్సిటీల అవసరం ఉందని ఒక రిపోర్ట్‌ను అందజేశారు. దానిపై తర్వాతి కాలంలో చెప్పుకున్న స్థాయిలో కృషి జరగలేదు. మరోవైపు.. 2023 లెక్కల ప్రకారం మనదేశంలో ఉన్నత విద్య మార్కెట్ మొత్తం విలువ రూ.3,33,600 కోట్లు. ఈ విలువ ఏటా 15 శాతం చొప్పన పెరుగుతూ పోతోంది. రాశిలో మన విద్యాసంస్థలు ముందున్నా.. వాసిలో మనం వెనకే ఉన్నాము. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 పేరుతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలోని టాప్ 150 విశ్వవిద్యాలయాలలో IIT బాంబే 149వ స్థానంలో నిలవగా, IIT ఢిల్లీ 150వ స్థానం పొందింది. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ 400 యూనివర్సిటీల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం 328వ ర్యాంక్‌ను, అన్నా యూనివర్సిటీ 383వ ర్యాంక్‌ పొందగలిగాయి. ప్రమాణాల పరంగా 1200 యూనివర్సిటీలున్న దేశపు దుస్థితిని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Also Read: ధనస్వామ్యపు ధగధగల్లో భారత్..

మన దేశంలోని వర్సిటీల్లో నాలుగు దశాబ్దాల నుంచి పాఠ్యప్రణాళికలో ఇప్పడున్న అకడమిక్ కరికులమ్ నాలుగు దశాబ్దాల నాటిది. జాతీయ విద్యా విధానం – 2020 పేరుతో ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు మన ప్రమాణాలు పెంపుకు ఏమాత్రం దోహదం చేయలేకపోయాయి. మన ఉన్నత విద్యా విధానం విద్యార్థులను ఆధునిక సవాళ్ళకు సిద్ధం చేయలేకపోవటమే గాక ఆచరణాత్మక నైపుణ్యాలను అందించలేకపోతోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు అందుబాటులోకి తేవటం, బహుళరంగ విద్యా విభాగాలను ఎంచుకునే, మార్చుకునే వెసులుబాటు కల్పించటం, మెరుగైన వసతులతో పరిశోధన చేసే వాతావరణం, ప్రపంచ స్థాయిగల ఇతర విద్యాసంస్థలతో కలసి పనిచేసే అవకాశాన్ని కల్పించటం, అవసరాన్ని బట్టి విదేశాల పౌరసత్వం అందించటం వంటి వాటిమీద మన నూతన విద్యావిధానం దృష్టి పెట్టలేకపోవటం విచారకరం.

ఇక.. ఉన్నత విద్య విషయంలో తెలంగాణ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గత పదేళ్లలో ప్రభుత్వ కాలేజీలు, వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బందిని భర్తీ చేయకుండా మాటలతోనే నాటి కేసీఆర్ సర్కారు కాలక్షేపం చేసింది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టులు 2,828 ఉండగా.. అందులో 1,869 పోస్టులు అంటే మూడింట రెండొంతులు ఖాళీగానే ఉండటం గమనార్హం. నిజానికి 2017 నవంబర్‌ నాటికి యూనివర్సిటీల్లో 1,528 ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. అప్పట్లో 1,061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇదుగో.. అదుగో అంటూ ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఓసారి రిజర్వేషన్లు అంశం అంటూ, మరోసారి న్యాయపరమైన వివాదాలు అంటూ దాట వేస్తూ వచ్చాయి. దీనితో ఈ ఖాళీలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలలో 1600 పైగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లోనే 800పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వర్సిటీల్లోని 60 నుంచి 70 శాతం నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. సుమారు వంద ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు గత ప్రభుత్వ నిధులను ఆపేసింది. మరోవైపు సర్కారుకు అండగా నిలిచిన కొందరికి ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకునేందుకు కూడా గత సర్కారు ప్రయత్నించింది.

బీఆర్ఎస్ హయాంలో 2019 జూలై నుండి 2021 మే నెల మధ్యలో పది యూనివర్సిటీలకు వీసీలనే నియమించలేదు. నాడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కటంతో, తప్పనిస్ధితిలో 2021 మేలో అన్నీ యూనివర్సిటీలకు ప్రభుత్వం ఒకేసారి వీసీలను నియమించింది. వారి పదవీకాలం మే 21న ముగియటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించటంతో బాటు ఉన్నత విద్యమీద సమీక్ష నిర్వహించింది. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలకు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ గుర్తింపు ఆధారంగానే వర్సిటీ, కాలేజీ స్టాండర్డ్ ఏంటనేది తెలుస్తోంది. తెలంగాణలో మొత్తం 31 యూనివర్సిటీలుండగా, కేవలం సగం వర్సిటీలకే న్యాక్ గుర్తింపు ఉంది. అలాగే తెలంగాణలోని మొత్తం కాలేజీల సంఖ్య 2062 ఉండగా, ఇందులో కేవలం 286 ఉన్నత విద్యా కాలేజీలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉంది. దీన్ని అధిగమించేందుకు ఆయా వర్సిటీలు, కాలేజీలు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చొరవచూపటంతో బాటు తెలంగాణ వచ్చి పదేళ్లయిన వేళ.. ఉన్నత విద్యారంగం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విజన్‌, మిషన్‌ ప్రకటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన విశ్వవిద్యాలయాలు కోల్పోయిన తమ పాత వైభవాన్ని పొందగలుగుతాయి.

-సదాశివరావు ఇక్కుర్తి (సీనియర్ జర్నలిస్ట్)

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Plastic: ప్లాస్టిక్‌పై పోరాటం, నేటి అవసరం..

Fight Against Plastic, todays Need:పర్యావరణాన్ని కోలుకోని రీతిలో దెబ్బతీస్తున్న ప్రమాదకరమైన అంశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. గతంలో పట్టణాలకే పరిమితమైన ప్లాస్టిక్‌ వినియోగం నేడు పల్లెలకూ పాకింది. టీ షాపులు, పండ్ల...

TS Governance: పాలనపై ముద్రకు రేవంత్ ముందడుగు

CM Revanth Steps Forward To Impress Upon The Regime: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేపటికి నిండా ఏడు నెలలు పూర్తవుతాయి. ప్రభుత్వం ఏర్పడి, మంత్రులంతా...

Fuel Sources: ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం

Alternative Energy Sources Are The Refuge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా మానవుని ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే, అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను...