Kota Srinivasa Rao: టాలీవుడ్లో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఇకలేరు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం నాడు తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నిజంగానే ఆయన మరణం టాలీవుడ్ (Tollywood)కు తీరని లోటు. ఎందుకంటే.. ఏ పాత్ర కైనా ప్రాణం పొసే గొప్ప నటుడు. నవరసాలను అద్భుతంగా పలికించే వ్యక్తి. ఆ పేరే చాలు.. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నాటికి నేటికీ ఈయన పాత్రలు ఎవర్ గ్రీన్ అంతే. నవ్వించినా ఆయనే.. ఏడిపించినా ఆయనే.. ఇక విలనిజం చేయాలన్నా కోట తర్వాతే ఎవరైనా అలా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయేవారు. బహుశా ఈయన పాత్రలు నచ్చని సినీ ప్రియుడు లేరంటే నమ్మండి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘టాలీవుడ్ కోట’ కుప్పకూలిందనే చెప్పుకోవచ్చు. ఆయన్ను అభిమానించే అభిమానులు, నటులు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మీరు ఈ భూమిపైన లేకున్నా మీ గుర్తులుగా మీరు మాకిచ్చి వెళ్లిన ఎన్నో గొప్ప పాత్రల్లో మిమ్మల్ని స్మరించుకుంటాం’ అంటూ సినీ ప్రియులు, అభిమానులు, నటీ నటులు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ, పొలిటికల్ కెరీర్ ఎలా ప్రారంభమైంది..? ఆయన సినీ జీవితంలో ఉన్న వివాదాలేంటి? ఆయనకొచ్చిన అవార్డులు, ఎందుకు ఎక్కువ రోజులు రాజకీయాల్లో (Politics) ఉండలేకపోయారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
సినిమాల్లోకి ఎంట్రీ..
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు. కోట 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన విజయవాడలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. బాల్యం నుంచే కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. బాల్యం నుంచి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట సినిమాల్లో రంగప్రవేశం చేసేనాటికి రంగస్థలంపై 20 ఏళ్ళ అనుభవం గడించారు. 1978-79లో ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. ఎంతో మర్యాద పూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులు అందరినీ సినిమాలోకి కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం అనుకోకుండానే జరిగిపోయింది. అంతవరకూ ఎప్పుడూ సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు కూడా సినిమాలను సీరియస్ తీసుకోలేదు. ‘అహ నా పెళ్ళంట’ మూవీలో కథానాయిక తండ్రిగా చేసిన ‘పిసినిగొట్టు’ పాత్ర మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. బలమైన నాటకరంగ నేపథ్యం ఉండటం, అనేక నాటకాలలో నటించి, గొప్ప అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఇది ఆయన సినీ కెరీర్లో వివిధ పాత్రలను సులభంగా పోషించడానికి సహాయపడింది. ఇక అప్పట్నుంచి.. విలన్గా, కమెడియన్గా, సహాయ నటుడిగా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే కోట దానికి న్యాయం చేశారు. ఆయన నటించిన పాత్రల్లో చాలా వైవిధ్యం ఉంటుంది. కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదు.
Read Also- YSRCP: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీని వీడటంపై ధర్మాన ఫుల్ క్లారిటీ.. మనసులో మాట బయటికొచ్చిందే!
అక్షరాలా నిరూపించారు!
కొన్ని పాత్రలు కొంత మంది కోసమే పుడతాయి అనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈ మాట అక్షరాలా కోటకు సరిగ్గా సూట్ అవుతుంది. కోట విలన్ పాత్రలు కూడా ఎక్కువగా చేశారు. ‘యోగి’ సినిమాలో విలన్గా, ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖి’ సినిమాలో ఎన్టీఆర్కు తాతగా నటించి మెప్పించారు. మరొక సినిమా ‘బృందావనం’లో కూడా ఎన్టీఆర్ తాతగా నటించారు. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’ లో శ్రుతిహాసన్కు తండ్రిగా నటించారు. బాబు మోహన్-కోట కాంబో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే. అలా వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాల్లో జోడిగా నటించారు. కోట- రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ‘ఆ నలుగురు’లో నటించారు. అలా చిన్న చిన్న హీరోలు మొదలుకుని స్టార్, సీనియర్ హీరోల వరకూ సినిమాల్లో కమెడియన్, విలన్, తండ్రి ఇలా పలు పాత్రల్లో నటించారు. కోట చివరి సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’. ఇందులో విలన్గా శ్రీనివాసరావు నటించారు. ఇప్పటి వరకూ 700లకు పైగా సినిమాల్లో నటించారు. ఈ నంబర్ చాలు ఆయన కెరీర్లో ఎంత బిజీగా ఉన్నారో, ఎంత మంది దర్శకులు ఆయన నటనను కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఖ్యే ఆయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్థానాన్ని స్పష్టం చేస్తుంది.
Read Also- YSRCP: వైసీపీలోకి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్?
డైలాగ్స్, అవార్డ్స్
‘ఈ డెవడ్రా బాబూ.. నాకేంటి.. మరి నాకేంటి.. మరదేనమ్మా నా స్పెషల్.. అయ్య నరకాసుర.. అంటే నాన్నా.. నేనైతే ఖండిస్తున్నా..’ అది ఇలా మరెన్నే ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి. కోట శ్రీనివాసరావుకు ఒక ప్రత్యేకమైన వాయిస్ మాడ్యులేషన్ ఉంది. ఇది ఆయన పాత్రలకు ఒక ప్రత్యేకతను ఇస్తుంది. కొన్ని డైలాగ్స్ ఆయన వాయిస్లో వింటేనే వాటి ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. తెరపై విలన్ పాత్రలు పోషించినప్పటికీ, నిజ జీవితంలో ఆయన చాలా సరళమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిగా పేరు పొందారు. తోటి నటీనటులతో, టెక్నీషియన్లతో చాలా కలివిడిగా ఉంటారు. అలా కోట తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు. ఆయన సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయన నటనకు గాను అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. వాటిలో 9 నంది అవార్డులు (ఉత్తమ విలన్, ఉత్తమ కమెడియన్, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్), ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా ఉన్నాయి. స్పెషల్ జ్యూరీ అవార్డ్- ప్రతి ఘటన (1985), ఉత్తమ విలన్- గాయం (1993), ఉత్తమ విలన్- తీర్పు (1994), ఉత్తమ నటుడు- లిటిల్ సోల్జర్స్ (1996), ఉత్తమ విలన్- గణేష్ (1998), ఉత్తమ విలన్ – చిన్న (2000), ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002), ఉత్తమ సహాయ నటుడు – ఆ నలుగురు (2004), ఉత్తమ సహాయ నటుడు- పెళ్లైన కొత్తలో (2006) ఇలా అవార్డులు కోటను వరించాయి. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును (SIIMA 2012) అందుకున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం (2013) ఈ పురస్కారం కూడా ఆయన నటనా ప్రతిభకు గుర్తింపుగా లభించింది. 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో శ్రీనివాసరావును సత్కరించింది.
ఆయనకెవరు పోటీ..?
కోట ఫలానా సినిమాలో ఉన్నారంటే చాలు ఆయనకోసమే సినిమాలకు వెళ్లిన అభిమానులు ఎంతో మంది ఉన్నారు. కోటకు నటన వారసత్వంగా రాలేదు. తన స్వయం కృషితోనే ఈ స్థాయికి చేరుకున్నారు. అలా తన సినీ వారసత్వాన్ని కుమారుడికి కూడా ఇవ్వాలని ఎంతో తహతహలాడారు కానీ, ఊహించని విషాదం చోటుచేసుకున్నది. కోట శ్రీనివాస్కు కుమారుడు ఒక్కడే. కుమారుడు కోట ప్రసాద్ (1969-2010) 2010 జూన్ 21లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రసాద్ జేడీ చక్రవర్తి దర్శకత్వంలోని ‘సిద్ధం’ సినిమాలో నటించారు. 2010లో గాయం-2లో తన తండ్రితో పాటు నటించారు. కానీ దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే మరణించడంతో తన ‘ఇంటి కోట’ కూలిపోయిందని నాటి నుంచి ఆ లోటుతో బాగా మదనపడిపోయారు. ఇక కోట తెలుగు సినిమాలతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. ఇది ఆయన నటనా ప్రతిభకు, వివిధ భాషల ప్రేక్షకుల్లో ఆయనకున్న ఆదరణకు నిదర్శనం. వేరే భాషల్లో కూడా ఆయన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. వాస్తవానికి చాలా మంది నటులు ఏదో ఒక తరహా పాత్రలకు పరిమితం అవుతారు. కానీ కోట విలనిజంలో భయాన్ని, హాస్యంలో పసందును ఒకేసారి పండించగల అరుదైన నటుడు. కొన్ని సినిమాల్లో ఆయన విలనిజం నవ్వులు పూయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రను జీవించేస్తారు. అందుకే ఆయన పాత్రలు ప్రేక్షకులకు చాలా వాస్తవికంగా అనిపిస్తాయి. అందుకే ఆయనకు ఆయనే సాటి.. ఆయనకు ఎవ్వరూ లేరు పోటీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
Read Also- Viral News: హెల్మెట్కు సీసీ కెమెరా.. ఎందుకు చేస్తున్నాడంటే?
కళామతల్లికే కాదు.. ప్రజాసేవకు కూడా!
నటుడిగా మాత్రమే కాకుండా, సినిమా పరిశ్రమలో వివిధ విభాగాల్లో ఆయన తన సహకారాన్ని అందించారు. కొత్త టెక్నీషియన్లను, నటులను ప్రోత్సహించడంలో ఆయనకు మంచి పేరుంది. అటు సినీ ఇండస్ట్రీకి కోట చేసిన సేవ.. ఇటు నటీనటులు, టెక్నీషియన్లకు చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు. ఆయన సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఆయన నటించిన పాత్రలు, పలికించిన సంభాషణలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే ఆయన్ను లెజెండరీ నటుడు, మహానటుడు అని పిలవడానికి ఏమాత్రం సందేహాలు అక్కర్లేదేమో. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన నటనతో అనేక పాత్రలకు జీవం పోశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటులు కొద్దిమందే. అందులో ప్రథమ స్థానం కోటదే. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం అని టాలీవుడ్ నటీనటులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ప్రజాసేవలో కూడా భాగమయ్యారు. కోటకు బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్పేయి అంటే చాలా చాలా ఇష్టం. అందుకే అప్పట్లో సీనీ నటులు ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరినప్పటికీ.. కోటకు పిలుపొచ్చినా సరే వద్దనుకుని కాషాయ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా.. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లోనే బీజేపీ తరఫున గెలిచారంటే మామూలు విషయం కానే కాదు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మంచి ఊపు మీదున్న రోజులవి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయినా బీజేపీని కోట వదల్లేదు.. కోటాను కమలనాథులు వదులుకోలేదు. అగ్ర నాయకత్వం కోటని కీలక నేతగానే పరిగణించింది. కానీ, కొన్నాళ్ల తర్వాత కోటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యారు. వాస్తవానికి.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోట ఇక సినిమాలవైపు చూడరని, రాజకీయంగానే స్థిరపడతారని అంతా భావించారు. కానీ, కళామతల్లిని మాత్రం వదులుకోలేదు. రాజకీయంగా సేవ చేయాలని తనకు ఉన్నా.. అక్కడ పరిస్థితులు నచ్చకపోవడంతో ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని ఫిక్స్ అయ్యారు. అప్పటి వరకూ రీల్ లైఫ్లో నటించిన కోట.. అప్పట్నుంచీ రీల్ లైఫ్లో లీడర్గా నటించాల్సి వచ్చింది.
కోట వివాదాలు ఇవే..
కోట శ్రీనివాసరావు సాధారణంగా వివాదాల జోలికి వెళ్ళని, ధర్మంగా మాట్లాడే వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే, ఆయన కెరీర్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు లేదా కొన్ని సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోటపై ఆ రోజుల్లోనే దాడికి తెగబడ్డారు. నిజంగానే ఇది ఆయన జీవితంలో ఒక మాయని మచ్చగా నిలిచిన సంఘటన. ఎన్టీఆర్ నటించిన ‘మండలేశ్వర రాజు’ అనే సినిమాలో ఆయన విలన్ పాత్ర పోషించారు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఒక సందర్భంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఎన్టీఆర్ అభిమానులు కోట శ్రీనివాసరావుపై దాడి చేసి చితకబాదారు. ఈ ఘటన కారణంగా ఆయన కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇది ఆయన కెరీర్లో ఒక పెద్ద వివాదాస్పద సంఘటనగా పరిగణించబడుతుంది.
తెలుగు సినిమాల్లో పరభాషా నటులకు పెద్ద పీట వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ‘ మన దగ్గరకు నటులకు కొరత వచ్చిందా? మనకంటే తోపు నటులు పక్క రాష్ట్రాల్లో ఉన్నారా? వాళ్ళని ఎందుకు తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు’అంటూ కోట బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో కొంతమంది సినీ ప్రముఖులకు, ఇతర పరిశ్రమల వారికి నచ్చకపోవడం వల్ల చర్చకు దారితీశాయి. ఆయన ఈ విషయంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేవారు.
2021లో నటి అనసూయ భరద్వాజ్ గురించి కోట చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీవీలో యాంకర్లు, నటీమణులు వేసుకునే దుస్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అనసూయకు నచ్చలేదు. దీనిపై అనసూయ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీసింది.
మరోవైపు.. 1999లో బీజేపీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోట 2004 తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో ఉండాలంటే ఆర్థికంగా తట్టుకోవాలని, ఆ పరిస్థితి తన దగ్గర లేదని, అందుకే యాక్టివ్గా రాజకీయాల్లో ఉండలేకపోయానని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇది వివాదం కాకపోయినా, ఆయన రాజకీయ ప్రస్థానంపై చర్చకు దారితీసింది. ఇక పలు ఇంటర్వ్యూల్లో పలువురి నటీనటుల గురించి.. మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఓ సందర్భంలో గాండ్రిచ్చి ఉమ్మిన ఘటన గురించి చెబుతూ ఎంతో ఆవేదనకు లోనయ్యారు. ఇలాంటి విషయాలు మరెన్నో ఆయన పంచుకున్నారు. చూశారుగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం మొదలుకొని ఎగ్జిట్ వరకూ ఆయన జీవితంలో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు..!
Read Also-Viral News: 3 నెలల్లోనే సిటీ వదిలి వెళ్లిన యువకుడు.. అతడు చెబుతున్న కారణాలివే