Strange incident: ఉత్తర్ ప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో దారుణం జరిగింది. తనకంటే రెండింతలు వయసున్న మహిళను ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. దీంతో అరుణ్ రాజ్ పుత్ (Arun Rajput)ను అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యకు గల షాకింగ్ కారణాలను వెల్లడించారు. 52 ఏళ్ల మహిళ.. డీ ఏజింగ్ ఫిల్టర్లు ఉపయోగించి యువతిగా అతడికి పరిచయమైనట్లు తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ లో ఒకటిన్నరేళ్లుగా వారు టచ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే..
పోలీసుల ప్రకారం.. 52 ఏళ్ల రాణి దేవి (Rani Devi) అనే మహిళతో అరుణ్ రాజ్ పుత్ కు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ తరచూ సోషల్ మీడియాలో ఫిల్టర్లు వాడుతూ తనను తాను చిన్నవయసులో ఉన్నట్లు చూపించేది. కొన్ని నెలల సంభాషణల తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని క్రమం తప్పకుండా మాట్లాడుకోవడం ప్రారంభించారు. 2 నెలల క్రితం తొలిసారి వీరిద్దరూ ఫర్రుఖాబాద్లోని ఒక హోటల్లో కలిశారు. ఆమె నిజ స్వరూపం చూసి అరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వయసు గురించి ప్రశ్నించగా తనకు 52 ఏళ్లు అని ఆమె అంగీకరించింది.
నిజం తెలిసినా కూడా..
అయితే అరుణ్ ఆమెతో బంధాన్ని ముంగించలేదు. ఆమెను ఆర్థికంగా వాడుకోవాలని చూశాడు. రాణి దేవి నుంచి సుమారు రూ.1.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. కొద్ది రోజుల్లో తిరిగి ఇస్తానని మాటిచ్చాడు. అలా కొద్ది రోజుల తర్వాత రాణి తన డబ్బు అడగటం ప్రారంభించింది. లేదంటే తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో విసుగు చెందిన అరుణ్.. ఆమెను ఆగస్టు 10న మైన్పురిలోని ఒక పాడుబడ్డ ప్రదేశానికి రమ్మన్నాడు.
గొంతు నులిమి హత్య
అరుణ్ పిలిచినట్లుగానే రాణి పాడుబడ్డ బంగ్లా వద్దకు వచ్చింది. దీంతో డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన అరుణ్.. తన వెంట తెచ్చుకున్న దుప్పట్టాతో రాణి గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఆమె ఫోన్ తీసుకొని అందులో సిమ్ కార్డ్ తీసేశాడు. ఆపై రాణి మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే మర్నాడే కొట్వాలి ప్రాంతంలోని ఖర్పరీ రాజ్ బహా దగ్గర రాణి బాడీని పోలీసులు గుర్తించారు. శరీరం గుర్తు పట్టలేని స్థితిలో ఉండటంతో ఆమె ఫొటోలు తీసి.. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లకు పంపారు.
Also Read: CM Revanth Reddy: కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. చెత్తగాళ్లంటూ ఫైర్!
కాల్ రికార్డ్ ఆధారంగా అరెస్ట్
ఆగస్టు 30న ఫర్రుఖాబాద్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన ఆమె కుటుంబం.. ఆ ఫోటోను గుర్తించి ఆ మృతదేహం రాణిదేనని ధృవీకరించింది. ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా రాణి చివరిసారి మాట్లాడిన నంబర్ గుర్తించి పోలీసులు అరుణ్ రాజ్పుత్ను అరెస్టు చేశారు. విచారణలో అతను నేరాన్ని ఒప్పుకున్నాడని చెప్పారు. ‘పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడం, డబ్బు తిరిగి అడగడం, అసలైన వయసు దాచడం వంటి కారణాల వల్లే అరుణ్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.