Crime News: పాన్ షాప్ యజమాని కేసులో వీడిన మిస్టరీ
ఐదుగురు నిందితుల అరెస్ట్
బండ్లగూడ పోలీసులపై ప్రశంసలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సంచలనం సృష్టించిన పాన్ షాప్ యజమాని హత్య కేసులోని మిస్టరీని బండ్లగూడ పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఐదుగురి అరెస్ట్ చేశారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఆదివారం చాంద్రాయణగుట్ట ఏసీపీ ఏ.సుధాకర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బండ్లగూడ గౌస్ నగర్కు చెందిన షేక్ మొహిసిన్ స్థానికంగా ఆజం ఎంపోరియం షాప్ ఎదురుగా పాన్ షాప్ నడిపిస్తున్నాడు. గతనెల 29న రాత్రి 9 గంటల సమయంలో అక్కడికి వచ్చిన దుండగులు పాన్ షాప్ నుంచి మొహిసిన్ను బయటకు పిలిచారు. వచ్చీ రాగానే కొడవలి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. దాంతో తీవ్రంగా గాయపడ్డ మొహిసిన్ అక్కడే మరణించాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన బండ్లగూడ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ సిబ్బందితో కలిసి విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించి బండ్లగూడ పరిసరాల్లో ఉంటున్న సయ్యద్ షా ఫహద్ (23), సయ్యద్ సొహైల్ (21), మహ్మద్ ఆమెర్ (24), మహ్మద్ బిన్ అబ్బుల్లా సైఫ్ (32), షేక్ అఫ్రోజ్ (30) ఈ హత్యకు పాల్పడినట్టుగా నిర్ధారించుకున్నారు. వీరి కోసం గాలింపు చేపట్టి శనివారం రాత్రి అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
Read also- Mohan Babu: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?
పాతకక్షలే కారణం
నిందితుల్లో సయ్యద్ షా ఫహద్, మహ్మద్ బిన్ అబ్దుల్లాకు పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగుల్లో సభ్యులుగా ఉన్న రియాజ్, హష్మత్ లతో పాతకక్షలు ఉన్నట్టుగా విచారణలో వెల్లడైంది. తాము చేస్తున్న పశు దొంగతనాల గురించి సయ్యద్ షా ఫహద్, మహ్మద్ బిన్ అబ్దుల్లాలు పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించారని రియాజ్, హష్మత్ లు వీరిపై పగ పెంచుకున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తరువాత పగ తీర్చుకోవటానికి సయ్యద్ షా ఫహద్, మహ్మద్ బిన్ అబ్దుల్లా కోసం రియాజ్, హష్మత్ లు తమ తమ గ్యాంగ్ సభ్యులతో కలిసి గాలింపు మొదలు పెట్టినట్టుగా వెల్లడైంది. ఈ విషయాన్ని మొహిసిన్ తనకు పరిచయం ఉన్న సయ్యద్ షా ఫహద్, మహ్మద్ బిన్ అబ్దుల్లాకు చెప్పాడు జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టుగా తెలిసింది.
Read Also- India victory: వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్పై టీమిండియా సునాయాస విజయం
సమాచారం ఇస్తున్నాడని…
అయితే, సయ్యద్ షా ఫహద్, మహ్మద్ బిన్ అబ్దుల్లాకు తమ కదలికల గురించి ప్రత్యర్థి గ్యాంగులకు మొహిసిన్ సమాచారం ఇస్తున్నాడన్న అనుమానం వచ్చినట్టుగా దర్యాప్తులో తేలింది. దాంతోపాటు 2024, జనవరిలో సయ్యద్ షా ఫహద్ కు వరుసకు సోదరడయ్యే యువకున్ని హత్య చేసిన ఆదిల్ గ్యాంగుకు డబ్బు సాయం చేస్తున్నట్టుగా కూడా అనుమానించారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఎలాగైనా సరే మొహిసిన్ ను హత్య చేయాలని కుట్ర చేశారు. దీని ప్రకారం సయ్యద్ సొహైల్, మహ్మద్ ఆమెర్, షేక్ అఫ్రోజ్ లను తమతో కలుపుకొన్నారు. పథకం ప్రకారం గతనెల 29న పాన్ షాప్ వద్దకు వచ్చి మొహిసిన్ ను కిరాతకంగా హత్య చేశారు. మూడు రోజుల్లోనే మర్డర్ మిస్టరీ ఛేధించి నిందితులను అరెస్ట్ చేసిన బండ్లగూడ స్టేషన్ సీఐ దేవేందర్, సిబ్బందిని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ అభినందించారు.
