Crime News: వ్యాపారంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో చంపేస్తానని బెదిరించాడని వ్యక్తిని పట్టపగలే హత్య చేసిన అయిదుగురిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కత్తులు, మోటార్ సైకిల్, రక్తం మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జోన్ డీసీపీ కోటి రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మేడ్చల్ ప్రభుత్వ బాలుర స్కూల్ ప్రాంతంలో నివాసముంటున్న సయ్యద్ సిద్దిఖీ (38)ని కొంపల్లి సెంట్రల్ పార్క్ వద్ద వారాంతపు మార్కెట్లో పదుల సంఖ్యలో జనం చూస్తుండగానే దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా 24 గంటల్లోనే హత్యకు పాల్పడ్డ మచ్చబొల్లారం నివాసులు షేక్ అహమద్ (33), షేక్ రహమత్ (24), శశికుమార్ (23), వాగ్మార్ రాజు కమల్ (24)తోపాటు ఓల్డ్ అల్వాల్ కు చెందిన వరికుప్పల జంపన్న (20)ను అరెస్ట్ చేశారు.
Cyber Criminals Arrest: సైబర్ కేటుగాళ్లకు బ్యాండ్ బాజా.. రూ.4.37 కోట్లు వెనక్కి!
చంపేస్తానని బెదిరించటంతో…
విచారణలో వ్యాపార విభేదాల నేపథ్యంలో తనను చంపేస్తానని సయ్యద్ సిద్దిఖీ బెదిరించటంతో సహచరులతో కలిసి ఈ హత్య చేసినట్టుగా షేక్ అహమద్ వెల్లడించాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగే వారాంతపు మార్కెట్లకు తాను లైట్లను సరఫరా చేస్తుంటానన్నాడు. సయ్యద్ సిద్దిఖీ కూడా ఇదే వ్యాపారం చేసేవాడని చెప్పాడు. ఈ క్రమంలో తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపాడు. మార్చి నెలలో సయ్యద్ సిద్దిఖీ మేడ్చల్ వీక్లీ మార్కెట్ లో తనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టినట్టు వెల్లడించాడు.
ఈ మేరకు తాను ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపాడు. ఈ కేసులను ఉపసంహరించుకోవాలని సయ్యద్ సిద్దిఖీ తనను బెదిరించాడని చెప్పాడు. లేనిపక్షంలో తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని భయపెట్టాడని తెలిపాడు. ఈ క్రమంలో ఎప్పటికైనా అతని నుంచి ప్రమాదమే అని భావించి సహచరులతో కలిసి సయ్యద్ సిద్దిఖీని పథకం ప్రకారం హత్య చేసినట్టుగా వెల్లడించాడు. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులను డీసీపీ కోటిరెడ్డి అభినందించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు