Ganja Seized: ఉపాధి కోసం వచ్చి గంజాయి దందా చేస్తున్న ఇద్దరు నేపాలీలను ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్ దేశానికి చెందిన సూర్య సింగ్, రమేశ్ బహదూర్లు కొంతకాలం క్రితం బతుకుదెరువును వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. సంతోష్ నగర్ ప్రాంతంలోని ఈదీబజార్లో నివాసముంటున్నారు.
కాగా, తేలికగా డబ్బు సంపాదించటానికి ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా గంజాయి అమ్మటం మొదలు పెట్టారు. ధూల్ పేటకు చెందిన అభిషేక్ సింగ్ అనే పెడ్లర్ నుంచి గంజాయి కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని అమ్ముతున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన స్టేట్ టాస్క్ ఫోర్స్సీఐ నరేందర్, ఎస్సైలు సుజాత, శివచరణ్ తోపాటు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సురేందర్, ప్రసాద్, శంకర్, విక్రమ్లతో కలిసి దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని సీజ్ చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి మలక్ పేట ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
75కిలోల గంజాయి సీజ్
డ్రగ్స్ కు చెక్ పెట్టటానికి ఎక్సయిజ్, ప్రొహిబిషన్ అధికారులు ఈనెల 8 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గంజాయి రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్ఠిని సారించారు. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరిండింటెంట్ తిరుపతి, సీఐ రమేశ్, హెడ్ కానిస్టేబుళ్లు కరీం, బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీష్, విజయ్, హనుమంతులు భద్రాచలంలోని గోదావరి ఇసుక ర్యాంప్ సమీపంలో తనిఖీలు చేపట్టారు.
Also Read: Bhatti Vikramarka: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం మీకోసమే!
ఆ సమయంలో అటుగా వెళుతున్న కారును ఆపి సోదా చేయగా 75 కిలోల గంజాయి దొరికింది. విచారణలో దీనిని ఒడిషా నుంచి రాజస్థాన్కు తరలిస్తున్నట్టు వెల్లడైంది. గంజాయి స్మగుల్ చేస్తున్న అనిల్ కుమార్ శర్మ, ముఖేశ్ కుమార్ దేవ్ లను అరెస్ట్ చేశారు. పాల్వంచకు చెందిన దుర్గప్రసాద్ గంజాయి సరఫరా చేసినట్టు తెలియటంతో అతనిపై కూడా కేసులు నమోదు చేశారు.
20.6 కిలోల గంజాయి స్వాధీనం
కంపెనీ ఆపరేటర్గా చేస్తున్న ఉద్యోగంలో ఆశించినంత ఆదాయం రాకపోతుండటంతో గంజాయి పెడ్లర్గా మారిన వ్యక్తిని ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 10 లక్షల విలువ చేసే 20.6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. జలీలుద్దీన్ అహమద్ సిద్దిఖీ మహారాష్ట్ర ఔరంగాబాద్ నివాసి. స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో ఆపరేటర్గా పని చేస్తున్నాడు. తేలికగా డబ్బు సంపాదించటానికి కొంతకాలంగా గంజాయి దందా మొదలు పెట్టాడు.
సీలేరు నుంచి గంజాయి కొని మహారాష్ట్రకు స్మగుల్ చేస్తూ అమ్ముతున్నాడు. ఎప్పటిలానే ఈసారి కూడా కారులో సీలేరు వెళ్లి 20.6 కిలోల గంజాయి కొని మహారాష్ట్రకు వెళుతుండగా సంగారెడ్డి పొతురెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్ మెంట్ వద్ద సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. సీలేరుకు చెందిన లక్ష్మీబాయ, కృష్ణలు ఇతనికి గంజాయి అమ్మినట్టుగా తెలియటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు.
Also Read: S-400 Sudarshan Chakra: రంగంలోకి ఎస్-400.. ఇక భారత్ సేఫ్.. పాక్కు మాత్రం చుక్కలే!