Crime News: అధికారులు తనిఖీలను ముమ్మరం చేయటంతో దొరకకుండా ఉండటానికి గంజాయి పెడ్లర్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు పెడ్లర్లు కారు ఇంజన్ భాగంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి సూర్యాపేటకు తీసుకొస్తుండగా ఎక్సయిస్ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. 51.9కిలోల గంజాయితోపాటు కారు, పైలట్ గా వస్తున్న వ్యక్తి నుంచి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం(Shahnawaz Qasim) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన జకారియా సర్యాల్, నసీరా పూర్తియా వేట్టల్ తేలికగా డబ్బు సంపాదించటానికి కొంతకాలంగా గంజాయి దందా చేస్తున్నారు. తరచూ ఒడిషా(Odisha) వెళుతూ అక్కడ గంజాయి కొని తెలంగాణ(Telangana)కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
కూనవరం క్రాస్ రోడ్డు వద్ద..
ఈ క్రమంలోనే వారికి సూర్యాపేట(Surapeta)కు చెందిన కందుల రవి(Ravi) పరిచయం అయ్యాడు. ఇదే దందాలో ఉన్న కందుల రవి తనకు గంజాయి కావాలని చెప్పటంతో జకారియా, వేట్టల్ లు ఇటీవల ఒడిషా వెళ్లారు. 51.9కిలోల గంజాయి కొని ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. దొరకకుండా ఉండటానికి వాటిని ఇంజన్ భాగంలో పెట్టి సూర్యాపేటకు బయల్దేరారు. కాగా, గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం అందుకున్న ఖమ్మం(Khammam) ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్ఐ శ్రీహరిరావు సిబ్బందితో కలిసి భద్రాచలం కూనవరం క్రాస్ రోడ్డు వద్ద కారును పట్టుకున్నారు. 26లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కారు, పైలట్ గా వస్తున్న వ్యక్తి నుంచి బైక్ ను కూడా సీజ్ చేశారు. పరారీలో ఉన్న కందుల రవిపై కూడా కేసులు నమోదు చేసిన ఎక్సయిజ్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
Also Read: AICC: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఆరా? ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి రిపోర్ట్ సేకరణ!
లోయర్ ట్యాంక్ బండ్ లో..
లోయర్ ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్స్ వద్ద గంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎక్సయిజ్ ఎస్టీఎఫ్ డీ టీం సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. రాహుల్, నందకిశోర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక, కొండాపూర్ రోడ్డు నెంబర్ 3లోని బొటానికల్ గార్డెన్ వద్ద గంజాయి అమ్ముతున్న మైలారిశెట్టి సాయివర్మను అరెస్ట్ చేసి అతని నుంచి 25 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని సీజ్ చేశారు. నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి సంబంధిత ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్లలో అప్పగించారు.
Also Read: Tandur Protest: తాండూర్లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?
