Crime News: పాత తేదీలతో ఉన్న స్టాంప్ పేపర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాదారులకు విక్రయిస్తున్న గ్యాంగ్ సభ్యులను ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్వోటీ అధికారులు సరూర్ నగర్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో బాండ్ పేపర్లు, నకిలీ బర్త్, కుల, ఆదాయపు పన్ను ధృవీకరణ పత్రాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు.
ప్రధాన నిందితులు భార్యాభర్తలు…
హయత్ నగర్ కుంట్లూరు వాస్తవ్యులైన తోట వెంకట భానుప్రకాశ్ (55), తోట సాగరిక (38) దంపతులు. తొమ్మిదేళ్లుగా సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సాత్విక్ ఎంటర్ ప్రైజెస్ పేర వ్యాపారం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెంటల్ అగ్రిమెంట్లు, అఫిడవిట్లు, సేల్ డీడ్లు తదితర డాక్యుమెంట్లు తయారు చేసేవారు. దీనికి అవసరమైన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుల వద్ద డాక్యుమెంట్ రైటర్ గా వ్యాపారం చేస్తున్న ఆసిఫ్ నగర్ నివాసి సయ్యద్ ఫిరోజ్ అలీ (34), హయత్ నగర్ బొమ్మలగుడి ప్రాంతంలోని చెరుకూరి అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న అడ్డగూడూరు చంద్రశేఖర్ (64) నుంచి కొనేవారు.
Also Read: Anti-Narcotics Award: ప్రపంచంలోనే నెంబర్ వన్.. పోలీసుల కిరీటంలో మరో కలికితురాయి..
డబ్బుపై ఆశతో...
అయితే, ఈ వ్యాపారంలో ఆశించినంత డబ్బు రాకపోవటంతో వెంకట భానుప్రకాశ్ అక్రమాలకు తెర లేపాడు. ఇందులో భాగంగా సయ్యద్ ఫిరోజ్ అలీ చంద్రశేఖర్ ల నుంచి పది…ఇరవై యేళ్ల క్రితం నాటి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను ఎక్కువ ధరలకు కొనటం మొదలు పెట్టాడు. ఇలా కొన్న స్టాంప్ పేపర్లపై ఉన్న వివరాలను రిన్ అలా, థిన్నర్ ల సహాయంతో ఎరేజ్ చేసేవాడు. ఆ తరువాత తన వద్దకు వచ్చే వారి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకుంటూ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ఇవ్వటం మొదలు పెట్టాడు.
నకిలీ రబ్బరు స్టాంపులు...
ఇలా నకిలీ డాక్యుమెంట్ల తయారు చేయటానికి వెంకట భానుప్రకాశ్ నిమ్స్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీధర్, కింగ్ కోఠి హాస్పిటల్ లో ఫార్మసీ సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్న బీ.పాండు, లైసెన్స్ డ్ స్టాంప్ వెండర్ సూర్యప్రకాశ్ రెడ్డి, అడ్వకేట్లు ఆర్.భూపతిరెడ్డి, బీ.రవీంద్ర ప్రసాద్ యాదవ్, నర్సింహారావుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేయించి ఉపయోగించాడు. దీనికి దిల్ సుక్ నగర్ నివాసి, రబ్బర్ స్టాంప్ మేకర్ పత్యప్రభు సహకరించాడు.
280 ఫేక్ డాక్యుమెంట్లు…
ఇలా గత ఒక్క సంవత్పరంలోనే 280 ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసిన వెంకట భానుప్రకాశ్ వాటిని కబ్జాలు చేయటమే పనిగా పెట్టుకున్న వారికి విక్రయించాడు. ఈ విషయం తెలిసి బొటిక్ షాప్ నడుపుతున్న సరూర్ నగర్ నివాసి జల్లా కిషోర్ కుమార్ తనకు ఒక ఫేక్ సేల్ డీడ్ తయారు చేసి ఇవ్వాలని వెంకట భానుప్రకాశ్ ను అడిగాడు. డబ్బు తీసుకుని వెంకట భానుప్రకాశ్ ఫేక్ సేల్ డీడ్ చేసి ఇవ్వగా ఖమ్మంకు చెందిన చంచల నిఖిల్ సహాయంతో బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు.
Aslo Read: Maheshwar Reddy on Congress: మంత్రివర్గ విస్తరణకు అడ్డుగా సీఎం.. అందుకే విభేదాలు!
ఇవే కాదు…
ఇక, వెంకట భానుప్రకాశ్ అంబర్ పేటకు చెందిన మహ్మద్ జలీల్, నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామానికి చెందిన పులుసు మహేశ్ గౌడ్ తో కలిసి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు కూడా తయారు చేశాడు. దీని కోసం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ప్రవీణ్, నార్సింగి మున్సిపాలిటీ ఆఫీస్ లో పని చేస్తున్న దుడ్డు సుధీర్ కుమార్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగి ముదస్సిర్ లు అతనికి సహకరించారు.
పక్కా సమాచారంతో దాడులు...
ఈ గ్యాంగ్ సాగిస్తున్న అక్రమాల గురించి పక్కగా సమాచారాన్ని సేకరించిన ఎల్బీనగర్ ఎస్వోటీ అధికారులు, సరూర్ నగర్ పోలీసులతో కలిసి సాత్విక్ ఎంటర్ ప్రైజెస్ పై దాడి చేశారు. వెంకట భానుప్రకాశ్, సాగరిక, అడ్డగూడూరు చంద్రశేఖర్, అడ్డగూడూరు అనిల్, మహ్మద్ జలీల్, జల్లా కిశోర్ కుమార్ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సయ్యద్ ఫిరోజ్ అలీ, పుల్లా మల్లేష్ గౌడ్, ప్రవీణ్, దుడ్డు సుధీర్ కుమార్, ముదస్సిర్, చంచల నిఖిల్, సత్యప్రభుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి వందల సంఖ్యలో నకిలీ డాక్యుమెంట్లతోపాటు రబ్బరు స్టాంపులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన అధికారులను కమిషనర్ సుధీర్ బాబు అభినందించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు