Kuntlur Road Accident: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్ నగర్ సీఐ నాగరాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కుంట్లూర్ గ్రామంలోని నారాయణ కాలేజీ (బాసర క్యాంపస్) సమీపంలో పసుమాముల గ్రామం వైపు నుంచి కుంట్లూరు వైపు స్కోడా కారు వస్తున్నది. అదే సమయంలో కుంట్లూరు నుంచి పసుమాముల వైపు డీసీఎం వ్యాన్ వస్తుండగా మూల మలుపు వద్ద అతివేగంతో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుంట్లూర్ గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు చంద్రసేనారెడ్డి(24), చుంచు జంగారెడ్డి కుమారుడు త్రినాథ్ రెడ్డి(24), చుంచు శ్రీనివాన్రెడ్డి కుమారుడు వర్షిత్ రెడ్డి(23) అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఇరుక్కున్న వారి మృతదేహాలను స్థానికులు గడ్డపారల సహాయంతో బయటకు తీశారు. అలిమేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కల్యాణ్ రెడ్డి తీవ్రంగా గాయపడగా స్థానికంగా ఉన్న ప్రైవేటు దవాఖానకు తరలించారు.
Also Read: Chattisgarh Encounter: నక్సల్స్కు భారీ ఎదురుదెబ్బ.. అగ్రనేత సహా 30 మంది మృతి!
ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా
కుంట్లూరు గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మంగళవారం రాత్రి పెద్ద అంబర్ పేటలో ఓ ఫంక్షన్ కు వెళ్లారు. రాత్రి నాంపల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బసచేశారు. స్వగ్రామం కుంట్లూర్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 2 నిమిషాలైతే ఎవరి ఇండ్లకు వారు చేరుకుందామనే లోపు అంతలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని స్థానికులు ఆవేదన చెందారు.