TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నియమావళి ప్రకారం, శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం భక్తుల ఆధ్యాత్మికతకు భంగం కలిగించడంతో పాటు భక్తకోటి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. అందుకే తిరుమలలో రాజకీయాలపై మాట్లాడడం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అయితే, కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి టీటీడీ నిబంధనలను అతిక్రమించారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం ఉదయం ఆయన రాజకీయాలపై మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఓటర్లను బెదిరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ తరహా ఎలక్షన్ తాను గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. పీ.రవీంద్రనాథ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు టీటీడీ తీర్మానాన్ని అతిక్రమించినట్టు అయింది. దీంతో, ఆయనపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ విజిలెన్స్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరించారని టీటీడీ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. విజిలెన్స్ అధికారులు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది.
Read Also- Crematorium reel: వైరల్ అవ్వడం కోసం దిగజారిన యువతి..
ఈమధ్యనే టీటీడీ తీర్మానం
తిరుమల శ్రీవారి పవిత్రను కాపాడడంతో భాగంగా ఈ పుణ్యక్షేత్రంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, నిందారోపణలు చేయకుండా నాయకులను నిలువరించేందుకు టీటీడీ టీటీడీ ధర్మకర్తల మండలి ఇటీవలే ఓ తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం టైమ్లో శ్రీవారిని దర్శించుకున్న రవీంద్రనాథ్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన ఆయన అంతటితో ఆగకుండా పులివెందుల ఎన్నికలపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉండేలా కూటమి సర్కార్ పన్నాగాలు పన్నుతోందని ఆరోపించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావడం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఈ తరహాలో ఎలక్షన్స్ జరగలేదని పేర్కొన్నారు.
Read Also- Viral Polyandry: ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవడంపై తొలిసారి స్పందించిన అన్నదమ్ముళ్లు
కాగా, తిరుమలలో మీడియాతో మాట్లాడిన రవీంద్ర నాథ్ రెడ్డి, 2029లో తిరిగి జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించాలని కోరుకుంటునట్టు చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన కూటమి సర్కార్ ప్రజలను మోసగించిందని, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజానీకం విసుగుచెందిందని వ్యాఖ్యానించారు.
Read Also- Mahesh Kumar Goud: గత రేవంత్ రెడ్డి వేరు..ఇప్పుడు వేరు: మహేష్ కుమార్ గౌడ్