YS Jagan: వైఎస్సార్ కడప.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా. ఇంకా చెప్పాలంటే వైసీపీకి (YSR Congress) కంచుకోట. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఫ్యాన్ పార్టీకి పెట్టని కోటలాగా ఉంటుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల సంగతి అటుంచితే.. సొంత జిల్లా (YSR Kadapa) అంటే అధినేతకు ఎప్పుడూ పట్టు ఉంటుంది. అలాంటిది 2024 ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతలా అంటే కార్యకర్తలు, నేతలను కాపాడుకోలేని పరిస్థితి. మరోవైపు అవినీతి ఆరోపణలతో పెద్ద తలకాయలే కుర్చీలు దిగిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో సీట్లు కోల్పోయిన కడప.. ఇప్పుడు ఏకంగా ఒక్కొక్కటిగా కూటమి వశం అవుతున్నాయి.
దెబ్బ మీద దెబ్బ..
అసలే ఓ వైపు నేతలు పార్టీని వీడుతుండగా.. మరోవైపు కార్యకర్తలు మొదలుకుని కీలక నేతల వరకూ కేసులతో సతమతం అవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి పార్టీ ఇంకా గట్టెక్కనే లేదు కానీ వైసీపీకి, జగన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అందులోనూ సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే నిజంగానే జగన్ పరువు పోయినట్లేననే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన కడప మేయర్ కె.సురేశ్ బాబును పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా కుర్చీ కోసం జరిగిన ఫైట్ అని వైసీపీ ఆరోపిస్తున్నది. అప్పట్లో మేయర్ పక్కనే ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి కుర్చీ వేయలేదని పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారని వైసీపీ విమర్శలు గుప్పిస్తు్న్నది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేయర్ పదవిని కూడా పోగొట్టుకుందంటే అది మామూలు విషయం కానే కాదు. ఇదే ఆరోపణలతోనే మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిశోర్లను కూడా పదవి నుంచి తొలగించారు.
Read Also-AP Politics: ఏపీలో ‘హెలికాప్టర్’ ఫైట్.. కొంపదీసి ఇదంతా సంపద సృష్టేనా?
ఒక్కరోజులోనే…
ఒక్కరోజు గ్యాప్లోనే మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేయడం గమనార్హం. కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. గురువారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే జగన్తో తనను మాట్లాడించాలని మూడు నెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నప్పటికీ కనీసం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. దీంతో ఇక వైసీపీలో ఉండకూడదని డిసైడ్ అయిన చంద్ర రాజీనామా చేశారు. తన అనుచరుల అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. కాగా, చంద్ర.. టీడీపీలో చేరడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. మరోవైపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోనూ ఇదే పరిస్థితి. మున్సిపాలిటీ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వైసీపీ పీఠాన్ని కోల్పోయింది. కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులకు ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ ఆటంకం కలిగిస్తున్నారని.. ఆ మధ్యనే కొందరు కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఎమ్మెల్యే సహా 15 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో కూటమి పార్టీ అవిశ్వాస తీర్మానం నెగ్గి, మున్సిపాలిటినీ కైవసం చేసుకున్నట్లు అయ్యింది.
Read Also-Kondapalli Srinivas: లోకేష్కు సామాన్యుడి ఫిర్యాదు.. చింతిస్తూ క్షమాపణ చెప్పిన మంత్రి కొండపల్లి