Pawan Kalyan: చెట్లు మనిషికి ఆనవాళ్లు.. వాటిని సంరక్షించడం మనిషి ప్రాథమిక బాధ్యత అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడికొండ నియోజకవర్గం, అనంతవరంలో నిర్వహించిన వన మహోత్సవ (Vana Mahotsavam) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరై మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సభలో సేనాని ప్రసంగించారు. ఈ ఒక్క రోజే కోటి మొక్కలు నాటడం.. వచ్చే ఏడాదికల్లా ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ‘ మా చిన్ననాటి కాలంలో మిత్రులకు ఇంటి చిరునామా చెప్పేటపుడు గుర్తులుగా చెట్ల పేర్లు చెప్పేవాళ్లం. మా ఇంటి ముందు ఫలానా చెట్టు ఉంటుందనో, వారి ఇంటి ముందు గోరింటాకు చెట్టు అంటూ ఆనవాళ్లు చెప్పేవాళ్లం. మనిషికి ఆనవాళ్లు చెట్లు, వృక్షాలే. వాటితో మన జీవనం.. జీవితం ముడిపడి ఉంది. నా వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు పర్యావరణాన్ని పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలు చేశాను. ఇక మీదట దాన్ని సమాజం మొత్తానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాను’ అని చెబుతూ పవన్ కళ్యాణ్ కాస్త ఎమోషనల్ అయ్యారు.
Read Also- Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు?
ఆయనే స్పూర్తి..
‘ చెట్టు మనకు ఆధారం. చెట్లు లేని భూమిని ఊహించలేం. నల్లమల అటవీ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా అలుపెరగకుండా పని చేస్తున్న కొమ్మిర అంకారావు లాంటి వ్యక్తి జీవితం భావితరాలకు స్ఫూర్తివంతం. అంకారావు గురించి తెలుసుకున్న కొద్దీ మరింత ఆసక్తిని కలిగిస్తుంది. పర్యావరణం, మొక్కల పెంపకం, అడవుల్ని సంరక్షించుకోవడం అనేది మనిషి ప్రాథమిక బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. నేను ప్రతిసారి వ్యక్తిగతంగా పర్యావరణం గురించి చాలా పనులు చేశాను. ఇక వచ్చే ఏడాది ఇదే సమయానికి ఐదు కోట్ల మొక్కల పెంపకం అనేది లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తాను. ఆ అనుభవాలను వచ్చే ఏడాది మీ అందరి ముందు పంచుకుంటాను. కార్చిచ్చులు ఆపేందుకు గొర్రెల కాపర్లకు తగిన అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. వాటిని నివారించేలా ప్రణాళికతో ముందుకెళ్తాం’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
బాబు విజన్లో..
‘ రాష్ట్రంలో పచ్చదనం మీద మేమంతా రకరకాల లెక్కలు చెబుతుంటే, సీఎం చంద్రబాబు మాత్రం కచ్చితంగా రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపొందాలని బలంగా చెప్పారు. లక్ష్యాలను మాకు నిర్దేశించారు. ప్రకృతి పరిరక్షణ మీద, పర్యావరణం మీద అవగాహన కలిగిన గొప్ప ముఖ్యమంత్రి. దీనికి అనుగుణంగా మేం కూడా నగర వనాలు, అడవుల సంరక్షణ, కార్చిచ్చుల నిరోధం, మొక్కల పెంపకం మీద ఓ ప్రణాళికను నిర్దేశించుకొని ముందుకెళ్తాం. చంద్రబాబు హయాంలో నీరు-చెట్టు వంటి పనులు విజయవంతంగా నిలిచాయి. ఆయన విజన్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. చంద్రబాబు మార్గదర్శకంలో అద్భుతమైన పచ్చటి ప్రగతిని సాధించి, తగిన విధంగా బాధ్యతను నిర్వర్తిస్తాం’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, ఈ సభావేదికపై నుంచే అంకారావును అటవీ శాఖ సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య, అమరావతి డవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ లక్ష్మీ పార్థసారధి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పీసీసీఎఫ్ ఎ.కె.నాయక్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Also- Seemaraja: సీమరాజా ఓవరాక్షన్.. ఏమిటీ గంజాయి వ్యవహారం?