Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో సినిమా హాళ్ల నిర్వహణను పగడ్బందీగా చేపట్టడంతో పాటు ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్.. సినిమాలు హాళ్ల బంద్ ప్రకటన, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. సినిమా హాల్స్ బంద్ నిర్ణయం వెనుక ఉన్న శక్తులేమిటో తేల్చాలని ఆదేశించారు. జనసేన నేతలు ఉన్నా విడిచిపెట్టవద్దని దిశానిర్దేశం చేశారు.
తన మన బేధాలు లేవు!
కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు.. ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని సూచించారు. ఇందులో తన మన బేధాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు.
థియేటర్లలో ఫుడ్ ధరలపై!
టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటాన్ని పవన్ ప్రస్తావించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత? ఎంతకు విక్రయిస్తున్నారు? నాణ్యత ప్రమాణాలు ఏంటి? వంటి అంశాలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరగడంతో పాటు పన్ను రూపేణ ప్రభుత్వానికి వచ్చే రాబడి కూడా పెరుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకొంటాయన్నారు.
సినిమా హాళ్ల బంద్ నేపథ్యంపై…
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం.. తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి.. పవన్ కు వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి పవన్ సూచించారు.
Also Read: MP Raghunandan: కవిత కొత్త పార్టీ వెనక కేసీఆర్.. త్వరలో పాదయాత్ర.. బీజేపీ ఎంపీ
చర్యలకు వెనకాడొద్దు!
సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ఇందుకు కారకుల్లో జనసేన తరపువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు.. బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకూడదని పవన్ సూచించారు. సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ స్పష్టం చేశారు.