Major Relief for Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట లభించింది. గ్రూప్ కంపెనీల నుంచి మోసపోయిన పెట్టుబడిదారుల కోసం రూ.611 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పునరుద్ధరించింది. ఈ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government) అప్పగించడం జరిగింది. తద్వారా వాటిని బాధితులకు తిరిగి పంపిణీ చేయవచ్చు. ఈడీ(ED) అటాచ్మెంట్ సమయంలో వీటి విలువ రూ.611 కోట్లు. కానీ, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1000 కోట్లు మించిపోయే అవకాశం ఉన్నది.
ఇంతకు ముందు, 2025 ఫిబ్రవరిలో ఈడీ (ED)సుమారు రూ.3,339 కోట్ల విలువైన ఆస్తులను (ప్రస్తుత మార్కెట్ విలువ రూ.6,000 కోట్లకు పైగా) బాధితులకు పునరుద్ధరించింది. తాజా పునరుద్ధరణతో కలిపి, ఇప్పటివరకు మొత్తం రూ.3,950 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు తిరిగి అప్పగించబడ్డాయి. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.7,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పునరుద్ధరించబడిన ఆస్తుల్లో 397 వ్యవసాయ భూములు, నివాస, వాణిజ్య ప్లాట్లు, అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో, 13 తెలంగాణలో, ( Telangana ) 4 కర్ణాటకలో ఉన్నాయి.
Also Read: Government Announces: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 3.64 శాతం డీఏ పెంపు!
అసలేం జరిగింది?
జూన్ 10, 2025న ఈడీ దాఖలు చేసిన పిటిషన్కు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. తద్వారా ఈ ఆస్తులను బాధితులకు పునరుద్ధరించడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ చర్యలు మోసగాళ్ల నుంచి దోచుకున్న ఆస్తులను తిరిగి న్యాయబద్ధంగా బాధితులకు అప్పగించడంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న కీలక ముందడుగుగా భావించొచ్చు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు తిరిగి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, 1999 కింద ఈ ప్రక్రియ జరిగింది.
అగ్రిగోల్డ్ (Agri Gold) సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పొంజీ స్కీమ్ను నడిపి, సుమారు 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ (ED) దర్యాప్తులో తేలింది. ఈ నిధులను వివిధ పరిశ్రమలకు దారి మళ్లించి, డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. ఈ కేసులో అవ్వా వెంకట రామారావు, అవ్వా వెంకట శేషు నారాయణ రావు, అవ్వా హేమ సుందర వరప్రసాద్తో సహా సంస్థ ప్రమోటర్లను ఈడీ అరెస్ట్ చేసింది. 2021 ఫిబ్రవరిలో 14 మందిపై ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసి, 2024 మార్చిలో మరో 22 మందిపై సప్లిమెంటరీ చార్జ్షీట్ సమర్పించింది.
అసలేంటీ అగ్రిగోల్డ్ సంస్థ?
అగ్రిగోల్డ్ (Agri Gold) అనేది ఒక పెట్టుబడి సంస్థ. ఇది ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, వారికి అధిక వడ్డీ లేదా రాబడులు ఇస్తామని ఆశచూపింది. అయితే, ఇది వాస్తవానికి పొంజీ స్కీమ్ ఆధారంగా పనిచేసింది. అంటే, కొత్తగా వచ్చే డిపాజిట్లను ఉపయోగించి పాత డిపాజిట్లకు వడ్డీ చెల్లించడం, భూముల్లో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి ప్రజలను నమ్మించడం జరిగింది. అగ్రిగోల్డ్ (Agri Gold) సంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతున్నామని, తమకు భారీ లాభాలు వస్తున్నాయని, కాబట్టి డిపాజిట్ దారులకు అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేసింది.
వివిధ రకాల డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టి, పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసింది. సేకరించిన ఆ నిధులను వాస్తవానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు, ఇతర వ్యాపారాలకు మళ్లించుకున్నారు. కొత్త డిపాజిట్లు తగ్గిపోవడంతో, పాత డిపాజిట్దారులకు వడ్డీ లేదా మూలధనం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈడీ దర్యాప్తు ప్రకారం, అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్, (Andhra Pradesh) తెలంగాణ,( TELANGANA) కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు సహా పలు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తునే నష్టపోయారు. కొందరు బాధితులు, ఏజెంట్లు ఈ మోసం కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి.
Also Read: Revanth Reddy: ఈ ఏడాది కొత్తగా 571 స్కూల్స్.. ఎన్రోల్మెంట్పై దృష్టిసారించండి!