KRMB Meeting: రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు కావస్తున్నది. కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని పంచాయితీలు తెగలేదు. వాటిలో ప్రధానంగా ఉన్నది నీటి వాటాల అంశం. కృష్ణా నది నీటిలో ఏపీ అధికంగా వాడుకుంటున్నదని మొదట్నుంచి తెలంగాణ వాదిస్తున్నది. అదేం లేదు. వాటాకు తగ్గట్టే వాడుకుంటున్నామనేది ఆంధ్రప్రదేశ్ వాదన. తరచూ నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకోవడం కామన్ అయింది. ఈ క్రమంలోనే సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది పంటలను దృష్టిలో పెట్టుకుని మీకు మీరే నిర్ణయానికి రావాలని బోర్డు స్పష్టం చేసింది.
హైదరాబాద్లో సమావేశం
హైదరాబాద్ జలసౌధలో కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ సమక్షంలో ఈ ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ హాజరయ్యారు. అలాగే, ఏపీ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు. ఏపీ వాటాకు మించి నీటిని వాడుకున్నదని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ. దీన్ని నిలువరించాలని కోరింది. శ్రీశైలం నుంచి ఉన్న ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, ఇతర ఔట్ లెట్ల నుంచి వాడుతున్న నీటిని పూర్తిగా ఆపేయాలని కోరింది. తాగునీటి కోసం నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి తెలంగాణకు 10 టీఎంసీలు అందుబాటులో ఉంచేలా చూడాలని బోర్డుకు విన్నవించింది.
వృధా నీటినే వాడుతున్నాం
ఏపీ అక్రమంగా నీటిని వాడుతున్నదని తెలంగాణ వాదిస్తుంటే, అంతా సక్రమమేనని మన అధికారులు స్పష్టం చేశారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటినే తాము వాడుకుంటున్నామని తేల్చి చెప్పింది. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎలా అని ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సమావేశంలో అన్నారు. శ్రీశైలం, సాగర్ కింద పంటలు ఉన్నాయని, వాటికి సరిపడా నీరు అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వరద జలాలకు సంబంధించిన వివరాలపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకుని నీటి అవసరాలపై ఓ నిర్ణయానికి రావాలని బోర్డు స్పష్టం చేసింది.
త్రిసభ్య కమిటీ సమావేశంలో లెక్కలు తేలతాయా?
ఈ ఏడాది కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణకు 131, ఏపీకి 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఈమధ్య బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, జులై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వాడకం వివరాలను ఇరు రాష్ట్రాలు ఇవ్వాలని తేల్చి చెప్పింది. అయితే, బుధవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో నీటి విడుదలకు సంబంధించి లెక్కలు తేలతాయని అంటున్నారు. సోమవారం కృష్ణా బోర్డు సమావేశం తర్వాత రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్లు విడిగా సమావేశమయ్యారు. నేడు చీఫ్ ఇంజినీర్లు భేటీ కానున్నారు.
Read Also: Ambati Rayudu: రాయుడు నోటి దూల.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే!