ఆంధ్రప్రదేశ్ స్వేచ్చ: YCP YS Jagan: జగన్ 2.0లో ప్రతి వైసీపీ కార్యకర్తకు తోడుగా ఉంటామని, ఈసారి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ కష్ట సమయంలో ఉన్న కార్యకర్తకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. ఈసారి కచ్చితంగా వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు.
అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫెర్ట్ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు తోడుగా ఉండాల్సినంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నాను. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటాను. కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్ చేసి చూపిస్తాడు అని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను అభినందిస్తూ, కూటమి ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలో దిశానిర్దేశం చేశారు.
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్
మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్సాఫ్. ఇవాళ మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. కారణం రాజకీయాల్లో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత ఉండాలని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. నేను అలాగే ఉంటాను. పార్టీ కూడా అలాగే ఉండాలని మొట్టమొదట నుంచి ఆశించాను. మీ అందరూ చూపించిన తెగువకు, స్పూర్తికి మీ అందరికీ హ్యాట్సాఫ్. మొన్న జడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్ స్ధానాలు కలిపి దాదాపు 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేక ఎన్నికలు వాయిదా వేశారు.
మరో 50 చోట్ల వాయిదా వేసే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలు జరిపారు. అలా నిర్వహించిన 50 స్ధానాలకు గానూ 39 చోట్ల వైసీపీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అసలు టీడీపీకి ఎక్కడా కూడా కనీసం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినా సరే, ఈ మాదిరిగా మభ్యపెట్టి, భయపెట్టి, ఆందోళనకు గురిచేసి, ప్రలోభాలు పెట్టి ఏకంగా పోలీసులను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వహించారు’ అని కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు.
గాలికెగిరిన సూపర్ సిక్స్.
ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా బుద్దీ జ్ణానం రెండూ లేవు. ప్రజాస్వామ్యంలో మనకు బలం లేనప్పుడు ఎవరైనా పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ అలా చేయకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి, ఎవరినైనా నేను భయపెడతాను, కొడతాను, చంపుతాను, ప్రలోభపెడతానని అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? అన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతుంది. ఎక్కడైనా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే తాను చేసిన మంచి పనిని చూపించి నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి, చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేటట్టు ఉండాలి.
Also Read: SVSN Varma To Join YCP: పవన్ కు ఊహించని దెబ్బ.. వైసీపీలోకి వర్మ.. పిఠాపురంలో ఏం జరుగుతోంది?
కానీ బాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. మోసాలుగా మిగిలాయి. చివరికి చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపు మీ జగన్ పాలనలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి నెలా ఏదో ఒక బటన్ నొక్కే పరిస్థితి ఉండేది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగువేళ్లు నోట్లోకి పోయేవి. చంద్రబాబు వచ్చాక నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి, ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లోకి పోలేడు, కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి లేదు’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
క్లైమాక్స్కు బాబు మోసాలు
చంద్రబాబు మోసాలు క్లైమాక్స్కు చేరాయి. చాలామంది చంద్రబాబు మారి ఉంటాడని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని చెబుతూ ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం అంటే సమాజంలో ఉన్న 20శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడంట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు.
రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. కేవలం 20 శాతం అంటున్నాడు. బాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ప్రజలు నవ్వుకుంటున్నారు. సీఎం మాట్లాడుతుంటే మీటింగ్లో నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. అయినా నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్టు అబద్దాలు మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నాడు.
సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయట్లేదని అడిగితే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అంటాడు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలోనే అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించాడు. దిక్కుమాలిన అబద్దాలు, మోసాలతో పాలన చేస్తున్నాడు. ఈ పాలన పోయి మళ్లీ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను చూసి తపించే గుండె ఉండే మంచి పాలన రావాలని ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు’ అని మాజీ సీఎం జగన్ వెల్లడించారు.
నేడు కర్నూలుకు జగన్
మాజీ సీఎం జగన్ నేడు కర్నూలులో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. 2 గంటల ప్రాంతంలో కర్నూలు నుంచి తాడేపల్లి చేరుకుంటారు. మరోవైపు రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఫార్మసీ విద్యార్ధిని నల్లపు నాగ అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పూర్తిగా అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.
తమ కుమార్తె పరిస్ధితిని వివరించి కన్నీరు తల్లిదండ్రులు పెట్టుకున్నారు. ఈ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అంజలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావు జగన్ను కోరారు. ఇందుకు మాజీ సీఎం స్పందిస్తూ అంజలి కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా కల్పించారు.
Also Read: Nara Lokesh: ఆ నియోజకవర్గంలో ఇక పండుగే.. నారా లోకేష్ కీలక ప్రకటన