Pawan Kalyan: మొంథా తుపాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవని, ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికారులకు ఆదేశించారు. పటిష్టమైన ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలని సూచన చేశారు. తుపాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అధికారులకు సూచించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని ఆదేశించారు.
తుపాను ప్రభావంతో పాడైన రోడ్లను ప్రాధాన్యత ప్రకారం రిపేర్ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు. 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు తెలియచేశారు. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామని వెల్లడించారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయని, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయని వెల్లడించారు. రక్షిత తాగు నీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేపడుతున్నట్టు వివరించారు.
Read Also- Montha Effects TG: మొంథా ఎఫెక్ట్తో అల్లాడిపోతున్న వరంగల్.. పలు జిల్లాల్లో కనీవినీ ఎరుగని వర్షపాతం
తక్షణ చర్యలు తీసుకోండి
తాగు నీరు అందించే పథకాలకు, నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని, ఈ చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రభావిత గ్రామాల్లో మొబైల్ శానిటేషన్ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. 21,055 మంది పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వాన నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఎక్కడా కలుషితం కాకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Read Also- Heavy Inflow: జలాశయాలకు మళ్లీ వరద.. గరిష్ట స్థాయికి చేరుతున్న నీటి మట్టాలు
ఈ తరుణంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతాయని, వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అరికట్టాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులకు గుర్తుచేశారు. మూడు, నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చేంతవరకు గ్రామాలలో నిరంతరం పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు, కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా లోటుపాట్లకు తావు ఉండకూడదని ఆదేశించారు. దెబ్బ తిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
