Ttd | ఈ నడుమ టీటీడీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్ననే తొక్కిసలాట జరగడంతో దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఇప్పుడు తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడి వ్యవహారం వివిదాస్పదంగా మారింది. టీటీడీ బోర్డు సభ్యుడైన నరేశ్ కుమార్ (naresh kumar) టీటీడీ ఉద్యోగిపై తాజాగా బూతు పదజాలంతో రెచ్చిపోయాడు. థర్డ్ క్లాస్ నా కొడుకువి నాకు చెప్తావా అంటూ అతను మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత చెందిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి బూతు పురాణం ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి.
నరేష్ కుమార్ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత మహాద్వారం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న నరేష్ కుమార్ వ్యక్తిగత సహాయకుడు గేట్ ఓపెన్ చేయాలని అక్కడ ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీకి (balaji) చెప్పాడు. మహాద్వారం ద్వారా ఎవరినీ బయటకు పంపడం కుదరదని.. ఏదైనా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని బాలాజీ తెలిపారు. దాంతో నరేష్ కుమార్ రెచ్చిపోయాడు. ‘ఏయ్ ఏమనుకుంటున్నావ్.. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా.. ధర్గ్ క్లాస్ నా కొడుకువి నాకు చెప్తావా.. బయటకు పో.. ముందు బయటకు పో’ అంటూ నోటికొచ్చినట్టు బూతు పదజాలంతో రెచ్చిపోయాడు.
ఇదంతా అక్కడే ఉన్న వారు వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేష్ కుమార్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం దేవుడి ముందు ఉన్నావనే విషయం మర్చిపోయి.. గుడిలో ఇలాంటి బూతులు మాట్లాడుతావా అంటూ ఆయనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.