NCP Politics: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత అజిత్ పవార్ బుధవారం నాడు అనూహ్య రీతిలో విమాన ప్రమాదంలో చనిపోయిన (Ajith Pawar Death) విషయం తెలిసిందే. కీలకమైన పదవిలో ఉన్న ఆయన.. ఆకస్మికంగా దుర్మరణం చెందడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో (NCP Politics) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీలో అధికార బాధ్యతల నిర్వహణపై చర్చలు మొదలయ్యాయి. అజిత్ పవార్ చేపట్టిన డిప్యూటీ సీఎం పదవీని ఆయన భార్య, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సునేత్రా పవార్ను (Sunetra Pawar) ఇవ్వాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదన చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సునేత్రా పవార్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దీనిని బట్టి సునేత్రా పవార్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉపఎన్నికలో సునేత్ర పోటీ!
సునేత్రా పవార్ను డిప్యూటీ సీఎంగా నియమించే ప్రతిపాదనపై చర్చించేందుకు ఎన్సీపీ నేతలు త్వరలోనే దేవేంద్ర ఫడ్నవీస్ను కలవనున్నారు. పార్టీ నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా ఎన్సీపీలో చర్చ మొదలైంది. పార్టీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజబల్, ధనంజయ్ ముండే, సునీల్ తట్కరే ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరుపుతున్నారు. సునేత్రా పవార్తో కూడా మాట్లాడినట్టుగా స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన స్థానం నుంచి సునేత్ర పోటీ చేస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
Read Also- KCR SIT Notice: గులాబీ నేతకు సిట్ నోటీసులు.. కాసేపట్లో కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ అత్యవసర భేటి!
ప్రస్తుతానికి ప్రఫుల్ పటేల్ చేతిలోనే?
అజిత్ పవార్ భార్య సునేత్ర కూడా ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉండడంతో, ఈ సంక్షోభ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ అన్ని విధాలా పార్టీని ముందుండి నడిపించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, భవిష్యత్తులో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో ఎన్సీపీ(ఎస్పీ)ని విలీనం చేసే అవకాశాలు ఉండొచ్చని, ఈ దిశగా భవిష్యత్లో చర్చలు జరగొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఎన్సీపీ సీనియర్ నేత జిర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇరు వర్గాలు ఇప్పటికే కలిసి ఉన్నాయని, విడివిడిగా ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని అందరికీ అర్థమైందని ఆయన చెప్పారు. అందరూ కలిసి ఉండాల్సిందేనని జిర్వాల్ మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలతో విలీనం ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Read Also- Seetha Payanam: ‘సీతా పయనం’ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ వచ్చింది.. ఓ లుక్కేయండి..
మరోవైపు, అజిత్ పవార్ అకస్మిక మరణంతో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమికి కూడా అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి. కూటమిలో అజిత్ పవార్ నెంబర్ 2, లేదా నెంబర్ 3 నాయకుడిగా ఉంటూ వచ్చారు. ఆయన చనిపోవడంతో కూటమిలో బీజేపీ ప్రాబల్యం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. అజిత్ పవార్కు ఉన్న పట్టు, అనుభవం సునేత్రా పవార్కు కొత్త కావడంతో, కీలక నిర్ణయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్, లేదా ఏకనాథ్ షిండే మాటలే నెగ్గ వచ్చుననే విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు, పార్టీని నడిపించే విషయంలో అజిత్ పవార్ స్థాయి మాస్ ఇమేజ్ను, పార్టీని నడిపించే వ్యూహ చతురతను సునేత్ర సాధించగలరా? చర్చ మొదలైంది. అయితే, అజిత్ పవార్ మరణం కారణంగా ఏర్పడిన పరిస్థితులను శరద్ రాజకీయంగా ఎలా వాడుకుంటారనే దానిపైనే పరిస్థితులు ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి.

