CP Sajjanar: : శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్య భద్రతను కాపాడేందుకు హైదరాబాద్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ (CP Sajjanar) కీలక నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది కోసం ప్రత్యేకంగా ‘హెల్త్ ప్రొఫైల్’ సిద్ధం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పెట్లబుర్జులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీపీ, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వారి మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఏ, బి, సి, డి కేటగిరీలుగా విభజిస్తామని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి తగిన జాగ్రత్తలు సూచించడంతో పాటు అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా పౌరులకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని సీపీ పేర్కొన్నారు. పండుగలు, బందోబస్తుల సమయంలో సిబ్బంది తమ కుటుంబాలను సైతం వదిలేసి అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఈ తీవ్రమైన పని ఒత్తిడిలో సిబ్బంది అనారోగ్యం బారిన పడకుండా చూసేందుకే ఈ హెల్త్ ప్రొఫైల్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. తాత్కాలిక ఆనందం కోసం మత్తుకు అలవాటు పడి, బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్ ప్రతిష్టను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఆహార కల్తీపై ఇకముందు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సీపీ వెల్లడించారు. దీని కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
వెంటనే కాల్ చేయండి
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ‘100’ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. విధి నిర్వహణతో పాటు ఆరోగ్యం, కుటుంబం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదం సమయంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న దినేశ్, మహమూద్ జకీర్, కలీం, రహీం, అమర్లతో పాటు కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జాఫర్ ఖాన్లను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, ఐపీఎస్ అధికారులు తఫ్సీర్ ఇక్బాల్, జోయల్ డేవిస్, శ్వేత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
24 ఏళ్ల తర్వాత
పాతబస్తీలోని చారిత్రక నేపథ్యం ఉన్న కొత్వాల్ హౌస్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. గత కొంతకాలంగా వేడుకలకు దూరంగా ఉన్న ఈ చారిత్రక కట్టడంలో, సుమారు 24 ఏళ్ల తర్వాత (2002 సంవత్సరం అనంతరం) మళ్లీ అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేయడం విశేషం. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సౌత్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, అదనపు డీసీపీ మాజిద్, టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Also Read: CP Sajjanar: ప్రజల భద్రతే ముఖ్యం.. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించను.. పోలీసులకు సజ్జనార్ క్లాస్!

