Ramchander Rao: తెలంగాణలోనూ మహారాష్ట్ర సీన్ను రిపీట్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ దుందుభి మోగించడంపై నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాంచందర్ రావు అధ్యక్షతన సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లలో 26 కార్పొరేషన్లలో ఎన్డీయే కూటమి విజయం సాధించినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. నిజామాబాద్ మేయర్ స్థానాన్ని సైతం బీజేపీ కైవసం చేసుకుంటుందని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తొలుత రాంచందర్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.
భయం మొదలైంది
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువ ఉన్న ఏరియాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచారన్నారు. అన్నామలైని రస్ మలాయ్ అంటూ రాజ్ థాక్రే ఎద్దేవా చేశారన్నారు. కానీ, బీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చిందన్నారు. రాజ్ థాక్రే వ్యాఖ్యలు తిప్పికొడుతూ లుంగీలు, రస్ మలాయ్ స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ(BJP) మరింత బలపడుతుందని, తెలంగాణలోనూ బీజేపీ ఎదుగుతుందని కాంగ్రెస్(Congress).. బీఆర్ఎస్(BRS)కు భయం మొదలైందని రాంచందర్ రావు(Ramvhender Rao) వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిరోజు బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికలపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల19 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీ టూర్ ఉందని, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు రాంచందర్ రావు తెలిపారు.
Also Read: Netflix Telugu: ఈ ఏడాది ‘నెట్ఫ్లిక్స్’లో విడుదల కానున్న బిగ్ బడ్జెట్ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి
నేడు బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రిపరేటరీ మీటింగ్
మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా శనివారం బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రిపరేటరీ మీటింగ్ను నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన సికింద్రాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ కొనసాగనుంది. ఈ సమావేశానికి అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, నేషనల్ ఎగ్జిగ్యూటివ్ మెంబర్, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి హాజరవ్వనున్నారు. కాగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీల ఇన్ఛార్జ్లు, మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సభ్యులు హాజరవుతారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.

