Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం వెనుక వైసీపీ కుట్ర ఉందని టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు (B.R. Naidu) ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అనుచరుడితో పాటు సాక్షి ఫొటోగ్రాఫర్ ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో భూమన స్పందిస్తూ.. టీటీడీ ఛైర్మన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పుడు కేసు నమోదు చేయడంతో పాటు ఎల్లో మీడియాలో విషప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఆ బాటిల్స్ మీ సైన్యావివే’
జనవరి 4న తిరుమలలో మద్యం బాటిళ్లు గుర్చించిన సందర్భంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ సీపీఆర్ఓ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారని భూమన కరణాకర్ రెడ్డి గుర్తుచేశారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలతో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తప్పుడు కేసు నమోదు చేయించారని ఆరోపించారు. బి.ఆర్.నాయుడు ప్రైవేట్ సైన్యం కొండపై తిష్టవేసి మద్యం తాగడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. మద్యం బాటిళ్లను చూసి వీడియో తీసినందుకే కోటి అనే వైసీపీ కార్యకర్తపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీ ఛైర్మన్కు సవాల్
సీఎం చంద్రబాబు, బి.ఆర్ నాయుడు ఒత్తిడి చేయడంతో పోలీసులు కోటిని కొట్టారని భూమన ఆరోపించారు. కోటి అరెస్టుకు ప్రధాన ఆధారంగా చెబుతున్న సీసీటీవీ ఫుటేజ్ ను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. కోటీ అనే వ్యక్తే మద్యం బాటిళ్లను అక్కడ పడేసినట్లు సాక్షాలు చూపించాలని సవాలు విసిరారు. నీవు నిజంగా శ్రీవారి భక్తుడవైతే తన ఛాలెంజ్ ను స్వీకరించాలన్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేసినా తన గొంతు ఆగదని భూమన స్పష్టం చేశారు. తిరుమలపై ఎలాంటి అరాచకం జరిగినా తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. మీరు చేస్తున్న ఘోరాలు, అన్యాయాలను ప్రజల ముందు ఉంచుతామని తేల్చిచెప్పారు.
బీఆర్ నాయుడుకు ఛాలెంజ్ విసిరిన భూమన
నీవు నిజంగా భక్తిపరుడివి అయితే మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టు – భూమన
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) January 9, 2026
Also Read: Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో సంక్రాంతి శోభ.. డ్యాన్స్ చేసిన పవన్.. మూడ్రోజులు ధూమ్ ధామ్!
‘అసలైన కుట్రదారులు మీరే’
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడుకు రూ. వేల కోట్ల సంపద ఎలా వచ్చిందో చెప్పాలని భూమన ప్రశ్నించారు. అసలైన నేరస్తులు, కుట్రదారులు మీరేనని మండిపడ్డారు. కోటీ విషయంలో తిరుమల టూ టౌన్ సీఐ శ్రీరాములు చేసింది చాలా తప్పని భూమన అన్నారు. ఒక తీవ్రవాదితో ప్రవర్తించినట్లుగా ఆయన తీరు ఉందన్నారు. మరోవైపు సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి ఏకంగా 40 మంది పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ నాయుడికి తనపై ఉన్న కోపం తగ్గాలంటే తనను మీ ఇంట్లో బంధించుకోవచ్చని భూమన చెప్పుకొచ్చారు.

