తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ (SV University) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీలోని అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపులు రావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. హ్యూమన్ ఐఈడి బాంబు పేరుతో పేల్చేస్తామంటూ గురువారం ఉదయం కళాశాల ఈమెయిల్ కి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన కాలేజ్ సిబ్బంది… తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
హుటాహుటిన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కాలేజీకి చేరుకున్న అధికారులు కాలేజీ మొత్తం తనిఖీలు చేపట్టారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో కళాశాలలోని పలు ప్రాంగణాలలో తనిఖీలు జరుపుతున్నారు. కాగా, ఈ మెయిల్ కేరళ రాష్ట్రం నుండి వచ్చినట్టు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. గత రెండు నెలల క్రితం కూడా తమిళనాడు రాష్ట్రం నుండి ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే ఇది ఆకతాయిల పనా, లేక నిజమైన బెదిరింపుల అర్ధంకాని పరిస్థితి నెలకొంది.