Crime News: నాటకీయతతో కూడిన సినిమాలను తలపించే దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఓ రైల్వే రిటైర్డ్ అధికారి ఇంట్లో పనిమనుషులుగా చేరిన దంపతులు ఊహించలేని పన్నాగానికి పాల్పడ్డారు. ఆస్తి కోసం కలలో కూడా ఊహించని స్కెచ్ వేశారు. ఇంటి ఓనర్ అయిన మాజీ ఉద్యోగిని, మానసిక వికలాంగురాలైన ఆయన కూతుర్ని పనిమనుషులు వారి నియంత్రణలోకి తీసుకున్నారు. ఇంటిని కూడా వారి ఆధీనంలోనే ఉంచుకున్నారు. తండ్రి, కూతురిని చిన్నచిన్న గదుల్లో బంధీలుగా మార్చావేసి, ఇంటి ఓనర్ల మాదిరిగా ఆ జంట పైఅంతస్తులలో బస చేసింది. ఐదేళ్లపాటు ఈ తతంగాన్ని కొనసాగించారు. కనీసం తిండి కూడా పెట్టకుండా ఆకలితో ఎండిపోయేలా చేశారు. దీంతో, రైల్వే మాజీ ఉద్యోగి అయిన ఆ ఇంటి యజమాని ఓం ప్రకాశ్ సింగ్ రాథోర్ (70) ఇటీవలే చనిపోయాడు. ఇక, 27 ఏళ్ల ఆయన కూతురు రష్మి పరిస్థితి చెప్పలేనంత దారుణంగా తయారైంది. ఆమె ప్రాణాలతోనే ఉంది, కానీ ఒక ఎముకలు గూడుగా మారిపోయింది. ఎంతలా ఎండిపోయిందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు.
వెన్నులో వణుకుపుట్టిస్తున్న ఈ కేసు ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి కొట్టేయాలన్న దుర్బుద్ధితో ఐదేళ్లపాటు బంధీలుగా మార్చినట్టు గుర్తించారు. ఈ ఘటనపై మృతుడు ఓం ప్రకాశ్ సింగ్ తమ్మడు అమర్ సింగ్ రాథోర్ మీడియాతో మాట్లాడారు. 2016లో వదిన చనిపోయిన తర్వాత అన్నయ్య తన నివాసాన్ని మార్చాడని, కూతురితో కలిసి వేరే ఇంట్లోకి వెళ్లాడని అమర్ సింగ్ వివరించారు. ఇంటి పనులు చేసుకోవడం తెలియకపోవడంతో రామ్ ప్రకాశ్ కుశ్వాహా, అతడి భార్య రామ్ దేవీలను పనిమనుషులుగా పెట్టుకున్నాడని తెలిపారు. నిందిత దంపతులు ఇద్దరూ క్రమక్రమంగా ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారు. తన అన్నయ్య, కూతురిని ఇంట్లోని కింద ఫ్లోర్లో ఉండే గదులకు పరిమితం చేసి, వాళ్లు మాత్రం పైఅంతస్తులలో సౌకర్యవంతంగా బతికారని అమర్ సింగ్ చెప్పారు. తన అన్నయ్యను కేవలం ఒకే ఒక్కసారి హాస్పిటల్కు తీసుకెళ్లారంటూ ఆయన వాపోయారు.
Read Also- New Year 2026: ప్రపంచవ్యాప్తంగా 2026 కొత్త సంవత్సరం వేడుకలు ఎలా జరుపుకుంటారంటే?
బంధువులు వెళ్తే కట్టుకథలు
ఓం ప్రకాశ్ సింగ్ బతికి ఉన్నప్పుడు ఆయనను చూడడానికి చుట్టాలు, బంధువులు వచ్చిన సమయంలో పనిమనుషుల జంట నాటకాలు ఆడినట్టు బయటపడింది. ఎవరిని కలవబోనని, చూడబోనంటూ ఆయన చెబుతున్నారంటూ బంధువులను తిప్పి పంపించేవారని అమర్ సింగ్ తెలిపారు. అడిగినా ఆహారం పెట్టేవారు కాదని, కానీ, తాము అడిగితే రోజుకు రెండుసార్లు చపాతీలు పెడుతున్నామంటూ అబద్ధాలు చెప్పేవారమని వెల్లడించారు. రెండు కాదు, కనీసం ఒక్క చపాతీ ఇచ్చినా పరిస్థితి ఇలా ఉండేది కాదని అమర్ సింగ్ చెప్పారు. అన్నయ్య ఓం ప్రకాశ్ చనిపోయాడంటూ సోమవారం తనకు సమాచారం ఇచ్చారని, వెళ్లి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాలు తీవ్ర దు:ఖాన్ని కలిగించాయని, చెప్పలేనంత దు:ఖానికి గురయ్యినట్టు వెల్లడించారు.
Read Also- Huzurabad News: ప్రభుత్వ భూమిని కాపాడలేరా? అధికారులారా అంటూ.. మొలంగూరు నేతల ఘాటు విమర్శలు!
అన్నయ్య మృతదేహం చెప్పలేనంత దారుణంగా కుచించుకుపోయిందని, ఇక, కూతురు రష్మీ అయితే ఒక గదిలో నగ్నంగా ఉందని తెలిపారు. ఆమె ఒక ఎముకల గూడులా తయారయ్యిందని, ఆమె ఒక మానసిక వికలాంగురాలని అమర్ సింగ్ వివరించారు. ఆకలితో అలమటించడంతో 27 ఏళ్ల యువతి కాస్తా 80 ఏళ్ల మహిళలా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఒంటి మీద కండ అన్నదే ఎక్కడా కనిపించలేదని, కేవలం అస్థిపంజరం మాత్రమే కనిపించిందన్నారు. అయితే, ఆమె ఊపిరితోనే ఉందని అమర్ సింగ్ కళ్లు చెమర్చారు. ఆస్తిని, బ్యాంకులోని సేవింగ్స్ను కొట్టేయాలనే దుర్బుద్ధితోనే ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. అయితే, ఈ ఘటనలో నిందితులపై కేసు వివరాలు వెల్లడికాలేదు.

