Pune Elections: సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పుణెలో మున్సిపల్ ఎన్నికలు (Pune Municipal Election) సమీపిస్తుండటంతో అక్కడి కార్పొరేటర్ అభ్యర్థులు.. ఆసక్తికరమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. విదేశీ పర్యటనలు, ఖరీదైన కార్లు, ఆభరణాలు, స్థలాలు, చీరలు ఇస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పుణె నగరం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కారు, స్థలం, ట్రిప్ ఫ్రీ
పుణెలోని లోహ్గావ్ – ధనోరి వార్డు (Lohgaon-Dhanori ward)లో ఓ అభ్యర్థి ‘లక్కీ డ్రా’ ద్వారా 11 మంది ఓటర్లకు ఒక్కొక్కరికి 1,100 చదరపు అడుగుల భూమి ఇస్తానని హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ‘రిజిస్ట్రేషన్’ ప్రక్రియను కూడా అతడు మెుదలుపెట్టేశారు. అలాగే విమన్ నగర్ (Viman Nagar)లోని ఒక అభ్యర్థి.. తమకు ఓటు వేసిన దంపతులకు ఐదు రోజుల థాయ్లాండ్ ట్రిప్ ను ఆఫర్ చేశాడు. మరికొన్ని వార్డుల్లోని అభ్యర్థులు.. తమకు ఓటు వేసిన వారి పేర్లను లక్కీ డ్రాలో తీసి వారికి ఎస్ యూవీ కార్లు, ద్విచక్ర వాహనాలు, బంగారు అభరణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
పట్టు చీరల పంపిణీ
పుణె ఎన్నికల నేపథ్యంలో గృహిణిలపై కూడా అభ్యర్థులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వారి దృష్టిని ఆకర్షించేందుకు వేల సంఖ్యలో పట్టు చీర్లను పంపిణీ చేస్తున్నారు. అలాగే కుట్టు మిషన్లు, వారి పిల్లల కోసం సైకిళ్లు ఆఫర్ చేస్తున్నారు. అంతే కాదు క్రికెట్ ను ఇష్టపడే యువకులకు క్రికెట్ లీగ్ (Cricket League)ను సైతం నిర్వహిస్తున్నారు. అందులో గెలిచిన జట్టుకు రూ.1 లక్ష వరకూ నగదు బహుమతులు అందిస్తున్నారు. దీన్ని బట్టి పుణె మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
Also Read: Indo – Pak Border: డ్రగ్స్ మత్తులో.. పాక్లోకి వెళ్లిన యువకుడు.. అక్కడి ఆర్మీ ఏం చేసిందంటే!
నామినేషన్లు షురూ
ఇదిలా ఉంటే పుణె మున్సిపల్ కార్పొరేషన్ (PMC) ఎన్నికలు 2026 జనవరి 15వ తేదీన జరగనుంది. డిసెంబర్ 23 నుంచే నామినేషన్ల ప్రక్రియ మెుదలైంది. మెుత్తం 165 కార్పొరేటర్ సీట్ల కోసం అభ్యర్థులు తలపడనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్ NCP, ఏక్ నాథ్ షిండే శివసేన) vs మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్, శరద్ పవార్ NCP (SP), ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT)) మధ్య ఉండనుంది. అయితే అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య సీట్ల భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

