Lionel Messi Payment: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఇటీవలే భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. తొలిరోజు కోల్కతా, హైదరాబాద్లలో, రెండవ రోజున ముంబై, మూడవ రోజు ఢిల్లీలో పర్యటించాడు. షెడ్యూల్లో లేకపోయినప్పటికీ అనూహ్యంగా నాలుగవ రోజు గుజరాత్ వెళ్లి, అనంత్ అంబానీకి చెందిన వంతారా నేషనల్ జూపార్క్లో పర్యటించాడు. అయితే, తొలి మూడు రోజుల పర్యటనకుగానూ మెస్సీకి ఎంత పేమెంట్ చెల్లించారన్న (Lionel Messi Payment) విషయాన్ని ఆర్గనైజర్ సతద్రు దత్తా వెల్లడించారు.
3 రోజులకు వంద కోట్లు
మెస్సీ మూడు రోజుల భారత పర్యటనకుగానూ ఆర్గనైజర్లు మొత్తం రూ.100 కోట్లు చెల్లించినట్టు సతద్రు దత్తా తెలిపారు. కోల్కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో షెడ్యూల్ కంటే ముందే మెస్సీ వెళ్లిపోవడంతో అభిమానులు విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో అరెస్టయిన దత్తాను ప్రశ్నించగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మెస్సీకి రూ. 89 కోట్లు, మరో రూ. 11 కోట్లు భారత ప్రభుత్వానికి పన్నుగా చెల్లించినట్టు దత్తా తెలిపాడు. అంటే, మూడు రోజుల పర్యటనకుగానూ మెస్సీ మొత్తం రూ. 100 కోట్లు చెల్లించినట్టు అయింది. చెల్లించిన మొత్తంలో 30 శాతం స్పాన్సర్ల ద్వారా, మరో 30 శాతం టికెట్ల విక్రయాల ద్వారా సమీకరించినట్టు తెలుస్తోంది.
దత్తా అకౌంట్లో రూ.20 కోట్లు సీజ్
సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసానికి సంబంధించిన కేసును కోల్కతా పోలీసులు వేగంగా విచారిస్తున్నారు. దీనిపై సిట్ (SIT) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దత్తాకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయగా, ఆయా అకౌంట్లలో రూ.20 కోట్లకు పైగా నగదు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు, శుక్రవారం దత్తా నివాసంలో జరిపిన సోదాల్లో అనేక కీలక పత్రాలు లభ్యమైనట్టు కోల్కతా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అయితే, తన బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బు, కోలకత్తా, హైదరాబాద్లలో జరిగిన మెస్సీ ఈవెంట్లకు సంబంధించిన టికెట్ సేల్స్, స్పాన్సర్ల ద్వారా వచ్చిన డబ్బు అని దత్తా చెబుతున్నాడు. అయితే, అతడు చెప్పేదాంట్లో నిజం ఉందో లేదో తెలుసుకునేందుకు పోలీసులు వివరాలు రాబడుతున్నారు.
కాగా, కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈవెంట్లో మెస్సీని చూడటానికి వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి మరీ టికెట్లు కొన్నారు. కానీ, మైదానంలో మెస్సీ చుట్టూ పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు గుమిగూడి ఉండడంతో గ్యాలరీల్లో ఉన్న అభిమానులకు మెస్సీ సరిగ్గా కనిపించలేదు. పైగా, షెడ్యూల్ ప్రకారం, ఉండాల్సిన సమయం కంటే ముందుగానే మెస్సీ వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కోపానికి గురైన కొందరు ఫ్యాన్స్ స్టేడియంలోకి దూసుకెళ్లారు. కుర్చీలతోపాటు స్టేడియంలోని పలు సామగ్రిని ధ్వంసం చేశారు. కొందరైతే అక్కడ లభించిన కొన్ని వస్తువులను తమవెంట తీసుకొని వెళ్లిపోయారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పరువుపోయేలా జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Read Also- Bigg Boss Grand Finale: ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మాములుగా ఉండదు.. ప్రోమో వచ్చేసింది!

