HYDRAA: నిజాం నాటి చెరువుకు ప్రాణం పోసిన‌ హైడ్రా!
HYDRAA (imagecredit:swetcha)
హైదరాబాద్

HYDRAA: నిజాం నాటి చెరువుకు ప్రాణం పోసిన‌ హైడ్రా!

HYDRAA: పాత‌బ‌స్తీలో నిజాం కాలం నాటి చారిత్ర‌క చెరువుకు హైడ్రా పూర్వ వైభవాన్ని సంతరింపజేసింది. క‌బ్జాల‌ను తొల‌గించి పునరుద్దరించింది. ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఆన‌వాళ్లే కోల్పోయిన చెరువును బ‌తికించి, చరిత్ర‌ను త‌వ్వితీసిన మాదిరి చెరువును రూపొందించిన హైడ్రా మరోసారి తన పనితీరును చాటుకుంది. ఇలా పాత‌బ‌స్తీకే మ‌ణిహారంగా బమ్-రుక్న్-ఉద్దౌలా చెరువును స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం అభివృద్ది పనులు తుది దశలో ఉండటంతో సంక్రాంతి లోపే ఈ చెరువును ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శ‌నివారం బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు అభివృద్ధి ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింద‌నుకున్న చ‌రిత్ర‌కు ప్రాణం పోస్తున్నామని, ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారుల‌ను ఆదేశించారు. చెరువుకు స్థానికులు సుల‌భంగా చేరుకునేలా ర‌హ‌దారుల‌తో పాటు ప్ర‌వేశ ద్వారాలుండాల‌ని సూచించారు. చెరువు చుట్టూ బండ్‌పై వాకింగ్‌ ట్రాక్‌లను ప‌రిశీలించారు. చెరువు లోప‌లి వైపు ఫెన్సింగ్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ప్లే ఏరియాలను ప‌రిశీలించారు. వృద్ధులు సేద దీరే విధంగా నిర్మాణాలు న‌లువైపులా ఉండేలా చూడాల‌న్నారు. పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

విహార కేంద్రంగా.. 

కాంక్రీట్ జంగిల్‌గా న‌గ‌రం మారిపోతున్న వేళ‌ పాత‌బ‌స్తీలో నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మికి చేరువ‌లో అభివృద్ధి చేస్తున్న బమ్-రుక్న్-ఉద్దౌలా చెరువు విహార కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ సూచించారు. ఔష‌ధ గుణాలున్న వృక్ష జాతితో పాటు మొక్క‌ల‌ను చెరువు చుట్టూ నాటాల‌ని సూచించారు. ప‌చ్చిక బైళ్ల‌తో పార్కులు ఆహ్లాద‌క‌రంగా తీర్చిదిద్దాల‌న్నారు. బ‌య‌టకు చెరువు ప‌రిస‌రాల్లో ఉన్న ఉష్ణోగ్ర‌త‌ల్లో తేడా తెలిసేలా ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం ఉండేలా చూడాల‌న్నారు. నిజాం కాలంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగించి క‌ట్ట‌డాన్ని ప‌టిష్టం చేయాల‌న్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్‌లు విశాలంగా ఉండేలా చేప‌ట్టిన నిర్మాణాల‌ను ఆయన పరిశీలించారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌, ఆరాంఘ‌ర్ ఇలా 10 కిలోమీట‌ర్ల మేరకు చెరువులోకి వ‌ర్షం నీరు వ‌చ్చేలా ఇన్‌లెట్లు నిర్మించాల‌ని, ఈ ప్రాంతంలో వ‌ర‌ద క‌ష్టాల‌కు ఈ చెరువు చెక్‌పెట్టేలా తీర్చిదిద్దాలని సూచించారు. సీసీటీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేసి నిఘాను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.

Also Read: Vrushabha Trailer: కింగ్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ఇరగదీశాడు.. ‘వృషభ’ ట్రైలర్ వచ్చేసింది చూశారా?

చ‌రిత్ర‌ను చాటేలా.. 

1970లో మూడ‌వ నిజాం సికంద‌ర్ జాహ్ పాల‌న‌లో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న న‌వాబ్ రుక్న్-ఉద్దౌలా ఈ చెరువును నిర్మించార‌ని, అందుకే బమ్-రుక్న్-ఉద్దౌలా చెరువు పేరు వ‌చ్చింద‌ని చారిత్ర‌క ఆధారాలు చెబుతున్నాయి. తాగు నీటి అవ‌స‌రాల‌ను త‌ర్చేలా 104 ఎక‌రాల మేర ఈ చెరువు విస్త‌రించి ఉంద‌ని చ‌రిత్ర చెబుతోంది. కాల‌క్ర‌మేనా చెరువు విస్తీర్ణం త‌గ్గుతూ హెచ్ఎండీఏ ఈ చెరువును 17.05 ఎక‌రాలుగా నిర్ధారించింది. చివ‌రికి 4.12 ఎక‌రాలుగా మిగిలిపోయింది. హైడ్రా గ‌త ఏడాది ఆగ‌స్టులో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. హెచ్ఎండీఏ పేర్కొన్న విధంగా పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తెచ్చింది. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గిస్తున్న‌ప్పుడు అనేక అవ‌రోధాల‌ను అధిగ‌మించిన హైడ్రా పలు రకాల విమ‌ర్శ‌ల‌ను సైతం ఎదుర్కొంది. అలా విమ‌ర్శించిన వారే ఔరా అనేట్టు హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసింది. ఇప్పుడు స్థానికులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ల‌లో కూడా ఊహించ‌డం క‌ష్టంగా ఉన్న ఈ ప్రాంతానికి ఇంత అందాన్ని తీర్చిదిద్దిన హైడ్రాకు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

చారిత్రక నేపథ్యం…

అడుగ‌డుగునా చారిత్ర‌క ఆన‌వాళ్లు, ఎన్నో విశేషాలు స్థానికంగా ఉన్న వృద్ధులు ప‌లు విధాలుగా వివ‌రిస్తున్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌, ఆరాంఘ‌ర్‌, కాటేదాన్ ప్రాంతాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద ఈ చెరువులోకి చేరేద‌ని చెబుతున్నారు. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమ్-రుక్న్-ఉద్దౌలా చెరువును రాణులు స్నానాల‌కు వినియోగించేవార‌ని చెబుతున్నారు. అలాగే బమ్-రుక్న్-ఉద్దౌలా చెరువులో వ‌న‌మూలిక‌ల చెట్లు, కొమ్మ‌లు వేసి ఆ దిగువున నిర్మించిన బావిలోకి వ‌చ్చిన ఊట నీటిని తాగేందుకు నిజాం పాల‌కులు వినియోగించేవార‌ని మ‌రి కొంత‌మంది వివ‌రిస్తున్నారు. ఔష‌ధ‌గుణాలున్న ఈ నీటిని మాత్ర‌మే నిజాంలు వినియోగించేవారని వెల్లడించారు. అంతే్గాక, ఈ చెరువు చుట్టు సువాస‌న‌లు వెద‌జ‌ల్లే పూల మొక్క‌లు విరివిగా ఉండేవ‌ని, ఆ పూల‌న్నీ చెరువులో ప‌డ‌డంతో ఇక్క‌డి నీటిని సెంటు త‌యారీకి వినియోగించేవార‌ని, ఇందు కోసం అర‌బ్ దేశాల‌కు ఇక్క‌డి నీరు తీసుకెళ్లేవారని కూడా వివరించారు. ఇలా ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ చెరువు మ‌ళ్లీ పున‌రుద్ధ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ప‌లువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Commissioner Sunil Dutt: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి: సీపీ సునీల్ దత్

Just In

01

Rail Ticket Hike: బిగ్ బ్రేకింగ్.. టికెట్ రేట్లు పెంచిన రైల్వే.. ఎంత పెరిగాయో తెలుసా?

Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం

Harish Rao: రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే: హరీష్ రావు

Medaram Jatara: మహిళలకు గుడ్ న్యూస్.. మేడారం జాతరకు ఫ్రీ బస్సు..!

Minister Ponguleti: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డు జీవో: మంత్రి పొంగులేటి