Crime News: తనకు నచ్చనివారి పిల్లలతో ఆడుతున్నాడని పదేళ్ల బాలున్ని దారుణంగా హత్య చేశాడు సవతి తండ్రి. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్ట గాజేమిల్లత్ ప్రాంతానికి చెందిన నఫీస్ బేగంకు పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తరువాత ఆమెకు కూతురు, కుమారుడు షేక్ మహ్మద్ అజహర్ (10) పుట్టారు. కొడుకు పుట్టిన తరువాత విభేధాలు తలెత్తటంతో మొదటి భర్త నుంచి ఆరేళ్ల క్రితం విడిపోయిన నఫీస్ బేగం తాను ప్రేమించిన షేక్ ఇమ్రాన్ అనే వ్కక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతనితోనే ఉంటోంది. కాగా, ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న వారితో షేక్ ఇమ్రాన్ కు పడక పోయేది.
కోపంతో రెచ్చిపోయిన షేక్ ఇమ్రాన్
ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలోని పిల్లలతో మాట్లాడొద్దని.. ఆడుకోవద్దని అజహర్ తో చెప్పాడు. అయితే, అజహర్ వారితో ఆడుకునేవాడు. ఈనెల 7న ఇలాగే ఆడుకుంటుండగా పిల్లల మధ్య గొడవ జరిగింది. దాంతో అజహర్ అవతలి వారిని తిట్టాడు. దాంతో ఆ కుటుంబ పెద్దలు షేక్ ఇమ్రాన్ ను పిల్లలను పెంచే పద్దతి ఇదేనా? అని తిట్టారు. దాంతో కోపంతో రెచ్చిపోయిన షేక్ ఇమ్రాన్ బాలున్ని విచక్షణారహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా పైకి లేపి రోడ్డపైకి విసిరికొట్టాడు. దాంతో అజహర్ తలకు తీవ్ర గాయాలై చెవుల్లో నుంచి రక్తస్రావం జరిగింది. వెంటనే అజహర్ ను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అజహర్ శనివారం తుదిశ్వాస వదిలాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

