Fake Job Scam: సైబర్ మోసాలను అరికట్టేందుకు తీసుకున్న కీలక చర్యలో భాగంగా, గృహ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గూగుల్కు నోటీసులు జారీ చేసింది. గూగుల్ ప్రకటనల పారదర్శకత( Ads Transparency) ప్లాట్ఫారమ్లో ఉన్న 15 ప్రకటనదారుల పేజీలు నకిలీ “పెన్సిల్ ప్యాకింగ్” వర్క్ ఫ్రం హోమ్ స్కీమ్ను ప్రచారం చేస్తున్నాయని గుర్తించి, వాటిని వెంటనే తొలగించాలని కేంద్రం ఆదేశించింది.
ఈ ప్రకటనలు హిందుస్తాన్ పెన్సిల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును దుర్వినియోగం చేస్తూ, నెలకు రూ.30,000 నుండి రూ.40,000 వరకు ఆదాయం వస్తుందని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు I4C పేర్కొంది. గూగుల్ నిర్వహించే Ads లైబ్రరీతో వీటిని గుర్తించారు.
IT చట్టాల ఉల్లంఘన.. 36 గంటల్లో తొలగించాలని ఆదేశం
I4C ఇచ్చిన నోటీసులో, ఈ ప్రకటనలు సమాచార సాంకేతిక (IT) చట్టం, 2000 భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. Section 79(3)(b), IT Rules లోని Rule 3(1)(d) ప్రకారం, ప్రభుత్వ సంస్థల నుండి నోటీసు అందినప్పుడు మధ్యవర్తి ప్లాట్ఫార్ములు చట్టవిరుద్ధ కంటెంట్ను తొలగించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి. దీంతో, గూగుల్ 36 గంటలలో ఈ URLలను డిసేబుల్ చేయాలని ఆదేశించారు. ప్రకటనదారుల పేజీ స్క్రీన్షాట్లు సాక్ష్యాలుగా నోటీసుకు జతచేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన I4C
ఈ ప్రకటనలు వినియోగదారులను తప్పుదారి పట్టించడమే కాకుండా, ఆర్థిక మోసాలకు దారి తీసే అవకాశం ఉందని I4C స్పష్టం చేసింది. హిందుస్తాన్ పెన్సిల్ వంటి ప్రసిద్ధ సంస్థ పేరును వాడటం వల్ల ప్రజలు విశ్వసించి సులభంగా మోసపోవడానికి అవకాశం పెరుగుతుందని గుర్తించింది.
ఆన్లైన్ అడ్వర్టైజింగ్ వేదికల దుర్వినియోగంపై దృష్టి
సోషల్ మీడియా వేదికల్లో ఉద్యోగ మోసాలు కొత్తవి కావు. అయితే, ఈ సంఘటన, పేలవమైన ఉద్యోగ స్కామ్లను ప్రోత్సహించడానికి పేమెంట్ అడ్వర్టైజింగ్ టూల్స్ను కూడా దుర్వినియోగం చేసే ధోరణిని స్పష్టంగా బయటపెట్టింది. పెద్ద ప్లాట్ఫార్ములను ఉపయోగించి విస్తృత స్థాయిలో ప్రజలకు చేరుకునే విధంగా ఈ మోసాలు జరగడం సైబర్ దర్యాప్తులకు కొత్త సవాలు అయ్యింది.
Also Read: Gold Rates: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. అతి భారీగా తగ్గిన ధరలు
సేఫ్ హార్బర్ కోల్పోయే ప్రమాదం
Section 79(3)(b) ప్రకారం, నోటీసు ఇచ్చిన తర్వాత కంటెంట్ తొలగించడంలో విఫలమైతే, ఆ ప్లాట్ఫార్మ్కు ఉన్న ‘సేఫ్ హార్బర్’ రక్షణ రద్దయే అవకాశం ఉంది. ఇది మూడోపక్షం పోస్టు చేసిన కంటెంట్పై బాధ్యత నుంచి మధ్యవర్తులను రక్షించే కీలక నిబంధన.
ఇటీవల ఎలక్ట్రానిక్స్ & IT మంత్రిత్వ శాఖ ప్రకటించిన మార్పుల ప్రకారం, ఇకపై Section 79(3)(b) నోటీసులను పంపే అధికారం జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులకు లేదా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులకు మాత్రమే ఉంటుంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో సబ్-ఇన్స్పెక్టర్ , అసిస్టెంట్-సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఇలాంటి నోటీసులు పంపిన సందర్భాలు ఉన్నాయి.

