Crime News: మహ్మద్ సలీం ఎలియాస్ సునీల్ శెట్టి.. ఈ పేరు వింటే పోలీసుల్లో సైతం కలవరం వ్యక్తమవుతుంది. కారణం సలీం ఆరితేరిన దొంగ కావటమే. హైదరాబాద్(Hyderabad) కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 150కి పైగా చోరీలు చేసిన సలీం పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లాడు. పీడీ యాక్ట్ ప్రయోగించి రిమాండుకు తరలించినా జైలు నుంచి బయటకు రాగానే తిరిగి నేరాలు చేయటాన్ని కొనసాగించాడు. ఇటీవల బండ్లగూడ స్టేషన్ పరిధిలో మరో నేరం చేసిన అతన్ని బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
యుక్త వయసు నుంచే దొంగతనాలు
సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీకాంత్(DCP Srikanth), చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్(ACP Sudhakar) తో కలిసి వివరాలు వెల్లడించారు. బాలాపూర్ ప్రాంతంలోని అలీనగర్ నివాసి మహ్మద్ సలీం ఎలియాస్ సునీల్ శెట్టి (52) పాత నేరస్తుడు. యుక్త వయసు నుంచే దొంగతనాలు చేయటం మొదలు పెట్టిన సలీంపై కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ నమోదై ఉంది. పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్లినా ప్రవృత్తిని మార్చుకోని సలీం నేరాలు చేస్తూనే ఉన్నాడు.
Also Read: Akhanda Promotion: బాలయ్య ‘అఖండ 2 తాండవం’ ప్రచారంలో వేరే లెవెల్.. ఇది వర్తే మామా..
ఇంట్లోకి చొరబడి
ఈ క్రమంలో బండ్లగూడ నివాసి షానవాజ్ మీర్జా(Shahnawaz Mirza) ఇంట్లోకి చొరబడి బంగారు నగలు, నగదు తస్కరించి ఉడాయించాడు. ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన బండ్లగూడ సీఐ దేవేందర్, డీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ యాదయ్యతో కలిసి విచారణ ప్రారంభించారు. దొంగతనం జరిగిన షానవాజ్ మీర్జా ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషించారు. దీంట్లో సలీం నేరానికి పాల్పడినట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సొత్తును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: CM Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వాన పత్రికను అందించిన సీఎం రేవంత్ రెడ్డి
