Gautam Gambhir – RoKo: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరిగిన సందర్భంగా మరోమారు ఈ వివాదం తెరపైకి వచ్చింది. నిన్నటి మ్యాచ్ లో రో-కో ద్వయం దుమ్మురేపడంతో దక్షిణాఫ్రికాపై భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. గత రెండు టెస్టుల్లో ఓడి నిరాశలో ఉన్న టీమిండియాలో కోహ్లీ, రోహిత్ రాకతో కొత్త జోష్ కనిపించింది. ఇదిలా ఉంటే గంభీర్ తో ఈ స్టార్ ప్లేయర్ల విభేదాలకు సంబంధించి ఓ సంచలన రిపోర్ట్ బయటకు వచ్చింది.
గంభీర్తో అనుబంధం తగ్గిందా?
దైనిక్ జగ్రన్ రిపోర్ట్ (Dainik Jagran Report) ప్రకారం.. గంభీర్ తో కోహ్లీ, రోహిత్ శర్మకు సరైన సఖ్యత లేదు. ఆదివారం నాటి మ్యాచ్ లో సెంచరీ చేసి పెవిలియన్ చేరిన కోహ్లీని గంభీర్ అభినందించారు. కోహ్లీ కూడా ఆలింగనం చేసుకున్నప్పటికీ అందులో ఎలాంటి ఎఫెక్షన్ లేకపోవడం వారి మధ్య విభేదాలను బయటపెట్టింది. ఇదిలా ఉంటే రాహుల్ ద్రావిడ్ తర్వాత గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టడం కోహ్లీ, రోహిత్ లకు ఇష్టం లేదని తాజా రిపోర్టు అంచనా వేసింది. గంభీర్ కు ఉన్న దూకుడు స్వభావం.. భారత జట్టుకు మంచిది కాదన్న అభిప్రాయాన్ని కోహ్లీ, రోహిత్ కలిగి ఉన్నారని పేర్కొంది. అయినప్పటికీ గంభీర్ ను చాలా సానుకూలంగానే హెడ్ కోచ్ గా రోహిత్, కోహ్లీ స్వాగతించారని తెలిపింది.
రిటైర్మెంట్ తర్వాతే చీలకలు?
విరాట్, రోహిత్ ఇద్దరూ ఒకేసారి టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పడం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచే రో-కో, గంభీర్ బయటపడటం ప్రారంభమైందని తాజా రిపోర్ట్ పేర్కొంది. అంతేకాదు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తోనూ రోహిత్, కోహ్లీకి సఖ్యత లేదని నివేదిక తెలిపింది. ఇదిలా ఉంటే టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత రోహిత్, కోహ్లీ.. తొలిసారి ఆస్ట్రేలియా టూర్ లో ఆడారు. తొలి రెండు వన్డేల్లో కోహ్లీ డకౌట్ కాగా, మూడో వన్డేలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు. మరోవైపు అదే మ్యాచ్ లో రోహిత్ సైతం సెంచరీతో చెలరేగాడు.
Also Read: Samantha Rumours: వైరల్ అవుతున్న సమంత ఫోటోల్లో నిజమెంత.. ఆ ఫోటోలు ఎక్కడివంటే?
బీసీసీఐ ఆందోళన
తాజాగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ప్రారంభం కావడంతో కోహ్లీ – గంభీర్ వివాదం కూడా సహజంగానే చర్చల్లోకి వచ్చింది. ప్రాక్టిస్ సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణలు.. గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయినట్లు తాజా నివేదిక తెలిపింది. మరోవైపు బీసీసీఐ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో రోహిత్ కు మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు స్పష్టం చేసింది. ‘ఆసీస్ లో సిరీస్ సందర్భంగా రోహిత్, అగార్కర్ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ గంభీర్ కూడా పెద్దగా మాట్లాడుకుంది లేదు. దీనికి తోడు రో-కో అభిమానులు పెద్ద ఎత్తున గంభీర్ పై నెట్టింట విమర్శలు చేస్తున్నారు. ఇది బీసీసీఐని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది’ అంటూ దైనిక్ జగ్రాన్ రిపోర్టు తెలిపింది.
