Local Body Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బందితో పాటు భద్రతా బలగాలు రెడీగా ఉండాలన్నారు. బందోబస్తు సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Local Body Elections: లోకల్ ఫైట్లో కాంగ్రెస్ మెగా ప్లాన్.. స్వయంగా సీఎం రేవంత్ మానిటరింగ్..!
తేదీలపై త్వరలోనే క్లారిటీ
డిసెంబరు 11న మొదటి దశ, 14న రెండో దశ, 17న మూడవ దశలో ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉన్నది. బుధవారం ఓటర్ల జాబితాకు సంబంధించి కీలక ఉత్తర్వులు వచ్చాయి. ఈ నెల 23న ఓటర్ల తుది జాబితా విడుదల అవుతుంది. ఆ తర్వాత రెండు మూడు రోజులకు షెడ్యూల్ వస్తుందని సమాచారం. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాలు ఉన్నాయి. అవి పూర్తయ్యాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిసింది.
స్థానిక’ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి.. రాణి కుముదిని
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలను 3 విడతలలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
సమర్థవంతంగా అమలు చేయాలి
ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలని, ఎన్నికల పరిశీలకులకు శిక్షణ అందించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రామ పంచాయతీలు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతామని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది, ఎన్నికల సామాగ్రిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

